18 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-07-30T05:52:47+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 18వ తేదీ నుంచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రిన్సిపాళ్ల సమావేశంలో వీసీ ప్రసాద్రెడ్డి
ఏయూ క్యాంపస్, జూలై 29: ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 18వ తేదీ నుంచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్రెడ్డి వర్సిటీ అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపాళ్ల అభిప్రాయాలను స్వీకరించారు. వారి అభ్యర్థన మేరకు ఆగస్టు ఐదు నుంచి జరగాల్సిన మొదటి సెమిస్టర్ పరీక్షలను 18 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబరు రెండు నుంచి నుంచి నిర్వహిస్తారు.
సెప్టెంబరు 1 నుంచి తరగతులు
డిగ్రీ ప్రథమ సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 18న ప్రారంభమై నెలాఖరుకు ముగుస్తాయని, అందువల్ల సెప్టెంబరు ఒకటి నుంచి రెండవ సెమిస్టర్ తరగతులు ప్రారంభించాలని వీసీ ఆదేశించారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణ, సిలబస్ తదితర అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
10 రోజుల్లో ఫలితాలు..
పరీక్షలు ముగిసిన కేవలం పది రోజుల్లో ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని వీసీ కోరారు. ఈ సమావేశంలో రెక్టార్ సమత, రిజిస్ర్టార్ కృష్ణమోహన్, ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.