ధాన్యం కొనుగోలులో జాప్యం

ABN , First Publish Date - 2021-05-09T04:48:47+05:30 IST

ఐదు రోజులుగా ధాన్యం కొనుగోలు చేపట్టకుండా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శనివారం ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి రాస్తారోకో చేపట్టారు.

ధాన్యం కొనుగోలులో జాప్యం
జిల్లా కేంద్రంలో ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి, రాస్తారోకో చేస్తున్న రైతులు

నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భువనగిరి శివారులో ధాన్యం బస్తాకు నిప్పంటించి రైతుల ఆందోళన, రహదారిపై రాస్తారోకో

గుండాలలో 48 గంటల నిరాహార దీక్ష

భువనగిరి రూరల్‌, మే 8: ఐదు రోజులుగా ధాన్యం కొనుగోలు చేపట్టకుండా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శనివారం ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి రాస్తారోకో చేపట్టారు. భువనగిరి పట్టణ శివారులో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే గత ఐదు రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, కాంటా వేసిన బస్తాలు ఎగుమతికాక,  మిల్లర్లు తాలు, తేమపేరుతో కొర్రీలు పెడుతుండడాన్ని నిరసిస్తూ రైతులు భువనగిరి- చిట్యాల ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తిచేస్తూ రాస్తారోకో చేపట్టడంతో పట్టణ ఇనస్పెక్టర్‌ ఏ.సుధాకర్‌ ఘటనా స్థలానికి వెళ్లి రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ఆందోళనలో స్తంభించిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ధర్నాలో రైతులు బి వెంకటేశం, పి శ్రీను, టి చంద్రపాల్‌, జి కృష్ణారెడ్డి, బి మోహనరెడ్డి, దత్తు యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. 



ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ నిరహారదీక్ష

గుండాల: రైతుల ధాన్యాన్ని కొనుగోలుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం మండలంలోని సుద్దాల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద యూత కాంగ్రెస్‌ నియోజకవర్గ ప్రధానకార్యదర్శి గూడ మధుసూధనగౌడ్‌ 48 గంటల నిరహార దీక్షచేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి, నెల గడుస్తున్నా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.  


మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి 

భూదానపోచంపల్లి: మండల వ్యాప్తంగా రైస్‌ మిల్లర్లు అక్రమంగా దోచుకుంటున్నారని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట రాంచంద్రారెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్‌ ఇక్కడ పండించిన ధాన్యానికి ‘ఏ’ గ్రేడ్‌గా కొనుగోలు చేయాలని ఆదేశిస్తున్నా.. రైస్‌ మిల్లర్లు మాత్రం రైతులను దోపిడీచేస్తూ ‘బీ’ గ్రేడ్‌గా గుర్తిస్తున్నారన్నారు. రైతులను రైస్‌ మిల్లర్లు దగాచేస్తున్నారన్నారు. మండల వ్యాప్తంగా రైతులు పండించిన పంటను ‘ఏ’ గ్రేడ్‌గా గుర్తించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సామ జంగారెడ్డి, మంచాల మధు, పద్మారెడ్డి పాల్గొన్నారు. 


ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి 

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని కాంగ్రెస్‌ భూదానపోచంపల్లి మండల అధ్యక్షుడు పాక మల్లే్‌షయాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన మండలంలోని ఆయా గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకుని మాట్లాడారు. కార్యక్రమాల్లో మర్రి నర్సింహారెడ్డి, తడక వెంకటేష్‌, రమే్‌షగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T04:48:47+05:30 IST