సీలేరు-ఆర్వీనగర్ రహదారి పనుల జాప్యంపై నిలదీత
ABN , First Publish Date - 2022-05-25T06:22:07+05:30 IST
‘‘సీలేరు-ఆర్వీనగర్ రోడ్డు పనులు ఎన్ని సంవత్సరాలు చేస్తారు.. ఈ అధ్వాన రహదారి వలన ఎందరి రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో మీకు తెలుసా.. ఇందుకు ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యమే కారణం.. ఆర్వీనగర్-పాలగెడ్డ రహదారి విస్తరణకు మంజూరైన రూ.84 కోట్లు మీ వల్లే ఏమయ్యాయో కూడా తెలియలేదంటూ’’ సీలేరు పట్టణ ప్రముఖులు ఆర్అండ్బీ పాడేరు డివిజన్ ఈఈ బాలసుందరబాబుపై మండిపడ్డారు.
ఆర్అండ్బీ అధికారులతో సీలేరు ప్రముఖులు వాగ్వాదం
సీలేరు, మే 24: ‘‘సీలేరు-ఆర్వీనగర్ రోడ్డు పనులు ఎన్ని సంవత్సరాలు చేస్తారు.. ఈ అధ్వాన రహదారి వలన ఎందరి రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో మీకు తెలుసా.. ఇందుకు ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యమే కారణం.. ఆర్వీనగర్-పాలగెడ్డ రహదారి విస్తరణకు మంజూరైన రూ.84 కోట్లు మీ వల్లే ఏమయ్యాయో కూడా తెలియలేదంటూ’’ సీలేరు పట్టణ ప్రముఖులు ఆర్అండ్బీ పాడేరు డివిజన్ ఈఈ బాలసుందరబాబుపై మండిపడ్డారు. మంగళవారం నర్సీపట్నం-సీలేరు రోడ్డు పనుల పరిశీలనకు ఆర్అండ్బీ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇన్ వెంకటేశ్వరరావు, ఆర్అండ్బీ పాడేరు డివిజన్ అధికారులు జెన్కో గెస్ట్హౌస్కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సీలేరు పట్టణ ప్రముఖులు గెస్టుహౌస్ వద్దకు చేరుకుని, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇన్కు ఆర్వీనగర్-పాలగెడ్డ రోడ్డు పనుల జాప్యంపై తమ గోడును విన్నవించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పాడేరు ఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు కలుగజేసుకుని పనులు జరుగుతున్నాయి కదా ఎందుకు గొడవ చేస్తున్నారని అనడంతో సీలేరు పట్టణ ప్రముఖుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సందర్భంగా ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ రోడ్డు దుస్థితి ఇలా తయారైందంటూ ధ్వజమెత్తారు. దీంతో క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇన్ వెంకటేశ్వరరావు కలుగజేసుకుని పట్టణ ప్రముఖులకు నచ్చజెప్పారు. త్వరలోనే మీ రహదారి సమస్య తీరుతుందని హామీ ఇచ్చారు. అల్లూరు జిల్లా కలెక్టర్ ఈ రహదారిపై దృష్టి సారించారని వివరించారు.