చీకటి అంచున ఢిల్లీ... అందోళనలో సీఎం
ABN , First Publish Date - 2021-10-09T23:05:06+05:30 IST
దేశ రాజధాని నగరం ఢిల్లీలో విద్యుత్తు కొరత ఏర్పడే
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం ఏర్పడటంతో ఢిల్లీకి విద్యుత్తును సరఫరా చేసే కంపెనీలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలగకుండా జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.
పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా, జనరేషన్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా సజావుగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కోరినట్లు కేజ్రీవాల్ శనివారం ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. ఢిల్లీ విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని, తాను వ్యక్తిగతంగా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నానని చెప్పారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు తాను కృషి చేస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని మోదీని కోరినట్లు తెలిపారు.
ఢిల్లీ నగరం ఆగస్టు నుంచి బొగ్గు కొరతను ఎదుర్కొంటోందని మోదీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇతర ప్లాంట్ల నుంచి దాద్రి, ఝజ్జర్ పవర్ ప్లాంట్లకు బొగ్గును, బవన, ప్రగతి-1, జీటీపీఎస్ ప్లాంట్లకు ఏపీఎం గ్యాస్ను సరఫరా చేయాలని కోరారు.