చెల్లికి న్యాయం కోసం మరోసారి Delhiకి పయనం..

ABN , First Publish Date - 2022-06-16T16:17:26+05:30 IST

అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న. కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా..

చెల్లికి న్యాయం కోసం మరోసారి Delhiకి పయనం..

మహబూబాబాద్ : అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న. కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా.. తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తన తల్లితో కలిసి ఎడ్ల బండిపై దేశ రాజధాని ఢిల్లీ(Delhi)కి బయల్దేరాడు. సీన్ కట్ చేస్తే.. మార్గమధ్యంలోనే ఏపీ పోలీసులు(AP Police) రంగప్రవేశం చేశారు. తామున్నామంటూ.. న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చి మరీ తీసుకెళ్లారు. ఆ తరువాత పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక వీళ్లతో అవదంటూ ఆ అన్న మళ్లీ హస్తినకు పయనమయ్యాడు. ఈసారి రిక్షా(Rikshaw)లో..





ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామ యువకుడు నేలవెల్లి నాగదుర్గారావు వ్యథ ఇది. చెల్లి కాపురం నిలబెట్టేందుకు అన్న మరోమారు తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఏపీలో న్యాయం దొరకడం లేదని మరోసారి రిక్షాలో ఢిల్లీ పయనయ్యాడు. సుప్రీంకోర్టు(Supreme Court), హెచ్ఆర్సీ(HRC)లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. రిక్షాకు సీజేఐ (CJI) ఫోటో కట్టి మరీ బయలుదేరాడు. గత మే 27న దుర్గారావును డోర్నకల్(Dornakal) మండలం మన్నేగూడెం దగ్గర ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు ఢిల్లీకి రిక్షా యాత్రను మన్నేగూడెం నుంచే దుర్గారావు ప్రారంభించాడు. 



తన సోదరికి న్యాయం చేయాలని వేడుకుంటూ మే 23న తల్లి జ్యోతితో కలిసి దుర్గారావు ఢిల్లీ యాత్ర ప్రారంభించాడు. ఖమ్మం జిల్లా బోనకల్‌ గ్రామానికి చేరుకున్న సమయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తన సోదరి నవ్యతను అదే మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కిచ్చి 2018లో వివాహం చేశామని చెప్పాడు. కట్నంగా రూ.23 లక్షల నగదు, 320 గ్రాముల బంగారం, 3 ఎకరాల పొలం ఇచ్చామని తెలిపాడు. పెళ్లి తర్వాత భర్త సక్రమంగా లేడని, పైగా అత్తింటివారు నవ్యతను బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, ఆ తర్వాత ఆమెను వేధిస్తుండడంతో పుట్టింటికి వచ్చేసిందన్నాడు. జరిగిన ఘటన గురించి చందర్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారని.. నవ్యత అత్తమామలు తమ పరపతి ఉపయోగించడంతో కేసులో ఎలాంటి పురోగతీ లేకపోయిందని వాపోయాడు. దీంతో విసిగిపోయిన తాను ఇక తమకు ఏపీలో న్యాయం దొరకదని భావించి, తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ చేరుకుని సుప్రీంకోర్టు, హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇక ఈసారైనా దుర్గారావు చెల్లికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.


Updated Date - 2022-06-16T16:17:26+05:30 IST