Delhiలో గవర్నర్ బిజీ బిజీ
ABN , First Publish Date - 2022-04-09T16:19:05+05:30 IST
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తన రెండు రోజుల పర్యటనను ముగించుకుని శనివారం రాత్రి చెన్నైకి తిరిగిరానున్నారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్సింగ్ను కలుసుకున్నారు.
- నేడు ప్రధానితో సమావేశం
చెన్నై: రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తన రెండు రోజుల పర్యటనను ముగించుకుని శనివారం రాత్రి చెన్నైకి తిరిగిరానున్నారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్సింగ్ను కలుసుకున్నారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమం, వారి సమస్యలను గురించి ఆయనకు వివరించినట్లు రాజ్భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలోని తమిళనాడు హౌస్లో బసచేస్తున్న గవర్నర్ శుక్రవారం ఉదయం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలుసుకున్నారు. నూతన విద్యా విధానం అమలు, ఆ విధానంలో తమిళ సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన పాఠ్యాంశాలను చేర్చే విషయంపై చర్చించారు. సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలుసుకున్నారు. శనివారం ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. నీట్ బిల్లు వ్యవహారంలో గవర్నర్పై ఆగ్రహంతో వున్న డీఎంకే.. ఆయన్ని రీకాల్ చేయాలని పార్లమెంటులో గట్టిగా డిమాండ్ చేసిన నేపథ్యంలో గవర్నర్ హూటాహూటీన ఢిల్లీ వెళ్లారు. తొలిరోజే హోంమంత్రితో భేటీ అవుతారని అన్ని వర్గాలు భావించగా, రక్షణశాఖ మంత్రితో భేటీ అవ్వడం గమనార్హం.