ఢిల్లీ ప్రజలకు కేజ్రీ బంపర్ ఆఫర్

ABN , First Publish Date - 2021-11-06T21:43:20+05:30 IST

ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2022 మే వరకూ ఉచిత రేషన్..

ఢిల్లీ ప్రజలకు కేజ్రీ బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2022 మే వరకూ ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారంనాడు ప్రకటించారు. ''ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. సామాన్య ప్రజానీకం కనీసం రెండు పూటలా తిండికి నోచుకోని పరిస్థితి. కోవిడ్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రధాని గారూ...పేద ప్రజలకు ఉచిత రేషన్ సరఫరా పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగించండి. ఢిల్లీ ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని రాబోయే ఆరునెలలు పొడిగించింది'' అని కేజ్రీవాల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద ఉచిత రేషన్ పథకాన్ని నవంబర్ 30 తర్వాత పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని ఆరోగ్య శాఖ కార్యదర్శి సుదర్శన్ పాండే ప్రకటించిన నేపథ్యంలో కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎఫ్‌ఎస్ఏ) 2013, పీఎంజీకేఎవై కింద లబ్ధిదారులకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తోంది. సిటీలో 2000కు పైగా రేషన్ దుకాణాలు, 17.77 లక్షల రేషన్ కార్డుదారులు, 72.78 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. కోవిడ్‌ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పీఎంజీకేఏవై పథకాన్ని గత ఏడాది మార్చిలో ప్రారంభించారు. తొలుత ఈ పథకాన్ని గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకూ నిర్దేశించినప్పటికీ, ఆ తర్వాత నవంబర్ 30 వరకూ పొడిగించారు.

Updated Date - 2021-11-06T21:43:20+05:30 IST