ఢిల్లీలో క్రాస్ జెండర్ మసాజ్‌లపై నిషేధం నిలిపివేత

ABN , First Publish Date - 2021-12-17T18:05:51+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో క్రాస్ జెండర్

ఢిల్లీలో క్రాస్ జెండర్ మసాజ్‌లపై నిషేధం నిలిపివేత

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో క్రాస్ జెండర్ మసాజ్ సర్వీసులపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు నిలిపేసింది. ఈ నిషేధానికి, మనుషుల అక్రమ రవాణాకు లేదా స్పాలలో వ్యభిచారానికి సమంజసమైన సంబంధం ఏదీ లేదని తెలిపింది. జస్టిస్ రేఖ పల్లి గురువారం ఈ తీర్పు చెప్పారు. 


స్పాల కార్యకలాపాలను నియంత్రించడం, చట్టవిరుద్ధంగా మనుషుల అక్రమ రవాణా లేదా నగరంలో వ్యభిచారం జరగకుండా నిరోధించడమే లక్ష్యంగా క్రాస్ జెండర్ మసాజ్ సర్వీసులను నిషేధిస్తున్నట్లు చెప్పారని, అయితే ఈ లక్ష్యానికి, క్రాస్ జెండర్ మసాజ్ సర్వీసులపై నిషేధానికి సమంజసమైన సంబంధం ఉన్నట్లు చెప్పలేమని జస్టిస్ రేఖ తెలిపారు. 


చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించేందుకు స్పా సర్వీసులను నియంత్రించవచ్చునని, అయినప్పటికీ ఈ రంగంలో వృత్తిపరమైన నైపుణ్యంగలవారిని సంప్రదించకుండా ఈ నిషేధాన్ని విధించారని పేర్కొన్నారు. నగరంలోని సుమారు 5,000 స్పాలలో కేవలం 400 స్పాలకు మాత్రమే చెల్లుబాటయ్యే లైసెన్సులు ఉన్నాయనే వాదనపై హైకోర్టు స్పందిస్తూ, ఢిల్లీ పోలీసులు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ వారంలోగా తమ పరిధిలో ఉన్న స్పాలను తనిఖీ చేసి, అక్రమ స్పాలను మూసివేయించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. చట్టవిరుద్ధమైన అంశాలపై కేసులు నమోదు చేయాలని, తదుపరి చర్యల కోసం నగర పాలక సంస్థ అధికారులకు సమాచారం తెలియజేయాలని  తెలిపింది. 


క్రాస్ జెండర్ మసాజ్ సర్వీసులపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని, అనంతరం నగర పాలక సంస్థలు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ కొందరు స్పాల యజమానులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది.


Updated Date - 2021-12-17T18:05:51+05:30 IST