Delhi LG Vs Kejriwal : కేజ్రీవాల్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మండిపాటు

ABN , First Publish Date - 2022-09-01T23:56:22+05:30 IST

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Vinai Kumar Saxena)

Delhi LG Vs Kejriwal : కేజ్రీవాల్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మండిపాటు

న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Vinai Kumar Saxena), ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మధ్య జగడం ముదురుతోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా సక్సేనా ట్విటర్ వేదికగా కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. 


సుపరిపాలన అందించాలని తాను పిలుపునిచ్చానని, అవినీతిని ఎంత మాత్రం సహించవద్దని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరానని, అందుకు బదులుగా కేజ్రీవాల్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ప్రజల దృష్టిని మళ్లించే చిట్కాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా మరిన్ని నిరాధారమైన, వ్యక్తిగత దాడులు జరిగినా ఆశ్చర్యపోనని తెలిపారు. 


ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party-AAP) ఆరోపణల ప్రకారం, సక్సేనా 2016లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) చైర్మన్‌గా పని చేసిన కాలంలో పెద్ద నోట్ల రద్దు జరిగింది. ఆ సమయంలో రూ.1,400 కోట్ల విలువైన రద్దయిన నోట్లను మార్చాలని తన సబార్డినేట్లను ఆయన కోరారు. 


ఈ ఆరోపణలను సక్సేనా తిరస్కరించారు. ఇదంతా వారి (ఆప్ నేతల) పగటి కలలేనని వ్యాఖ్యానించారు. ఆప్ నేతలు అతిషి, జాస్మిన్ షా, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్ తదితరులపై సక్సేనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని లెఫ్టినెంట్ గవర్నర్ హౌస్ వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2022-09-01T23:56:22+05:30 IST