Delhi Liquor Scam: కవిత క్షమాపణ డిమాండ్పై స్పందించని ఎంపీ పరవేశ్ వర్మ
ABN , First Publish Date - 2022-08-25T20:52:49+05:30 IST
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) క్షమాపణ డిమాండ్పై ఎంపీ పరవేశ్ వర్మ స్పందించారు. కవిత పరువునష్టం దావా కేసులో
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) క్షమాపణ డిమాండ్పై ఎంపీ పరవేశ్ వర్మ స్పందించారు. కవిత పరువునష్టం దావా కేసులో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు అందగానే స్పందిస్తానని పరవేశ్ వర్మ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ (Delhi Liquor Scam)లో తాము ఆరోపణలు చేసిన వారికి.. సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందన్నారు. సీబీఐ విచారణలో నిజానిజాలు తేలిపోతాయని పరవేశ్ వర్మ పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ (BJP) నాయకులు టీఆర్ఎస్ (TRS)పైన, కవితపైన నేరుగా ఆరోపణలు చేశారు. ఇందులో కవిత భర్త తరఫు బంధువుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సంబంధిత వర్గాలు మరికొన్ని వివరాలను బయటపెట్టాయి. ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా మద్యం కుంభకోణంపై మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిందని.. ఈ విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీలకు వారు కూడా హాజరయ్యారని పర్వేశ్ వర్మ ఆరోపించారు.
ఈ కుంభకోణానికి సంబంధించి దేశ వ్యాప్తంగా 31 స్థావరాలపై దాడులు జరిపి 16మందిపై ఎఫ్ఐర్ దాఖలు చేశారు. అయితే ఢిల్లీ, తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత కోర్టును ఆశ్రయించారు. నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. ఎంపీ పర్వేశ్ వర్మ (MP Parvesh Verma), మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాలపై పరువునష్టం కవిత దావా వేశారు. ప్రజాజీవితంలో తనకున్న పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడానికి ఈ పద్ధతులను ఎంచుకున్నారని న్యాయస్థానానికి నివేదించారు. పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా చేసిన ఆరోపణలపై హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు (ఇంజంక్షన్ ఆర్డర్) ఇచ్చింది. కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.