కరోనా నుంచి కోలుకుంటున్న రాజధాని.. భారీగా తగ్గిన తాజా కేసులు

ABN , First Publish Date - 2020-07-07T01:44:55+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీ కరోనాను జయిస్తోంది. తాజాగా నమోదైన కేసుల సంఖ్య దీనిని ధృవీకరిస్తోంది. గత కొన్ని రోజుల ...

కరోనా నుంచి కోలుకుంటున్న రాజధాని.. భారీగా తగ్గిన తాజా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోనాను జయిస్తోంది. తాజాగా నమోదైన కేసుల సంఖ్య దీనిని ధృవీకరిస్తోంది. గత కొన్ని రోజుల వరకు 5వేల వరకు నమోదయిన కేసులు ఆ తరువాత 3వేల లోపునకు పరిమితమయ్యాయి. రెండు, మూడు రోజులుగా 2వేల నుంచి 2,500ల వరకు నమోదయ్యయి. కానీ ఈ రోజు నమోదైన కేసుల సంఖ్య రాజధాని ప్రజలకు కొత్త ఊపిరులూదింది. ఏకంగా 1400 లోపు కేసులతో కరోనాను కచ్చితంగా జయించగలమనే నమ్మకాన్ని కలిగించింది. అయితే నేటితో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య లక్ష మార్కు దాటేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,379 కరోనా కేసులు నమోదయ్యాయి. 48 మంది మరణించారు. 749 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,00,823కి చేరింది. వీరిలో 25,620మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 72,088మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 3,115మంది ప్రాణాలు కోల్పోయారు.


ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం తరువాతే ఢిల్లీలో కరోనా అదుపులోకి వచ్చిందని అక్కడి బీజేపీ నాయకులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ‘కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహాయం కోరింది. దాంతో రంగంలోకి దిగిన తమ ప్రభుత్వం కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. దాని ఫలితంగానే కరోనా కేసులు ఈ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి’ అంటూ ఓ స్థానిక బీజేపీ నాయకుడు పేర్కొన్నట్లు సమాచారం.

Updated Date - 2020-07-07T01:44:55+05:30 IST