అప్పు ఇవ్వడమే ఆమె చేసిన తప్పైంది.. డబ్బులు అడిగినందుకు.. అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి చేసిన దారుణమిది!

ABN , First Publish Date - 2021-10-05T16:26:17+05:30 IST

ఆమె తన భర్తతో కలిసి..

అప్పు ఇవ్వడమే ఆమె చేసిన తప్పైంది.. డబ్బులు అడిగినందుకు.. అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి చేసిన దారుణమిది!

ఇంటర్‌నెట్‌డెస్క్: ఆమె తన భర్తతో కలిసి ఓ చిన్న దుకాణం నడుపుతోంది. తెలిసిన వ్యక్తే కదా అని అప్పు ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ వ్యక్తి చేసిన దారుణమిది. అసలు విషయంలోకి వెళ్తే..


ఢిల్లీలోని ద్వారకా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సోమ్ బజార్ రోడ్‌లో విభ అనే 30ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి ఓ చిన్న దుకాణాన్ని నడుపుతోంది. అదే ప్రాంతానికి చెందిన దీపక్(40)అనే వ్యక్తి ఆమె షాపులో సిగరెట్లతో పాటు మరికొన్ని వస్తువులు కొనుగోలు చేశాడు. వాటిని ఖాతా రాసుకోమని చెప్పి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మార్కెట్‌కు వెళ్లొస్తున్న దీపక్‌ను విభ చూసింది. కొనుగోలు చేసిన వస్తువులకు డబ్బులు ఇవ్వమని కోరింది. అందుకు దీపక్ తన వద్ద లేవన్నాడు. కానీ విభ డబ్బులు చెల్లించాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగింది. 



ముందే తాగిన మైకంలో ఉన్న దీపక్ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. దీంతో విభ ఒక కర్ర తీసుకుని బెదిరించింది. విభ కర్ర తీసుకుని బెదిరించడంతో.. దీపక్ తన దగ్గర ఉన్న సంచిలో నుంచి కత్తి తీసుకుని ఆమెను చంపేస్తానని బెదిరించాడు. గొడవ పెద్దది కావడంతో దీపక్ ఆమె గొంతు కోసేశాడు. ఈ ఘటన చూసి అదే దార్లో వెళ్తున్న వారందరూ షాకయ్యారు. విభను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు వెల్లడించారు.


స్థానికులు దీపక్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు పారిపోయాడు. కొద్దిదూరం వెళ్లాకా అతడు పట్టుబడడంతో.. స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రగాయాలయిన దీపక్‌ను పోలీసులు దీన్ దయాళ్ ఆసుపత్రిలో చేర్పించారు. డిశ్చార్జ్ అయిన వెంటనే అతడిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని చెప్పారు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Updated Date - 2021-10-05T16:26:17+05:30 IST