సీఎం పీఏనంటూ నగదు డిమాండ్
ABN , First Publish Date - 2022-07-01T08:48:44+05:30 IST
సీఎం పీఏనంటూ నగదు డిమాండ్
కేసు నమోదు.. పాత నేరస్తుడిగా గుర్తింపు
తాడేపల్లి టౌన్, జూన్30: సీఎం పీఏనంటూ ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఎండీకి మెసేజ్ పంపి డబ్బులు డిమాండ్ చేసిన గుర్తుతెలియని వ్యక్తిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ శేషగిరిరావు కథనం ప్రకారం.. సీఎం పీఏ నాగేశ్వరరెడ్డినంటూ మణిపాల్ ఆసుపత్రికి ఎండీకి ఓ మెసేజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆంధ్రాకు చెందిన రికీబుయ్ అనే యువకుడు ఎంపికయ్యాడని, అతడికి ఇంటర్నేషనల్ క్రికెట్ కిట్ అవసరం అయిందని, దాన్ని కొనుగోలు చేసేందుకు రూ.10,40,440లు పంపించాలని మెసేజ్ పెట్టా డు. బెంగుళూరులో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్ ఎండీ.. తాడేపల్లి మణిపాల్ వైద్యశాల అసోసియేట్ డైరెక్టర్ జక్కిరెడ్డి రామాంజనేయరెడ్డికి పరిశీలించాలని ఆదేశించారు. రామాంజనేయరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలువురు ప్రముఖుల పేర్లతో కార్పొరేట్ కంపెనీలకు ఫోన్ చేసి, డబ్బులు వసూలుచేసిన ఘటనల్లో ఆ మెసేజ్ పెట్టిన వ్యక్తిపై ఆరు కేసులు నమోదైనట్టు సమాచారం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నెల్లూరులో ఓ మంత్రి పీఏనంటూ ఫోన్ చేయడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.