సమాచారం లేకుండా కూల్చివేతలా?
ABN , First Publish Date - 2022-01-21T05:39:16+05:30 IST
సమాచారం లేకుండా కూల్చివేతలా?
ఘట్కేసర్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : పోచారం మున్సిపాలిటీలోని సంస్కృతి టౌన్షి్పలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లను, సెక్యూరిటీ కార్యాలయాన్ని కూల్చివేయడం పట్ల స్థానిక కౌన్సిలర్ హరిప్రసాదరావు, సీనియర్ సిటిజన్స్ ఫోరం నిర్వాహకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం టౌన్షి్పలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 17న కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఉత్తర్వులు బయటకు రాకుండానే మున్సిపల్ కమిషనర్ సురేష్ స్థానిక కౌన్సిలర్కుగాని టౌన్షిప్ పెద్దలకు గాని సమాచారమివ్వకుండా కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. కమిషనర్ కేవలం సూర్య నిర్మాణ సంస్థకు లబ్ధిచేకూర్చడం కోసమే ఆగమేఘాల మీద కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నప్పటికీ పట్టించుకోని కమిషనర్ వంద శాతం పన్నులు చెల్లిస్తున్న టౌన్షి్పపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడటం విడ్డూరంగా ఉందన్నారు. కూల్చివేతలపై విచారణ జరిపి కమిషనర్పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ను కోరారు.