రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2022-05-22T09:08:16+05:30 IST

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు ప్రజల్లో ఉండిపోతే తన పేరును ఎవరూ గుర్తుపెట్టుకోరని కేసీఆర్‌ భావిస్తున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన

  • అభివృద్ధి  మరిచిన.. కేసీఆర్‌ను చెప్పుతో కొట్టండి
  • తెలంగాణలో రాక్షస పాలన..
  • ముఖ్యమంత్రి వంద తలకాయలను ఛేదిస్తా: రేవంత్‌రెడ్డి
  • అక్కంపేటలో ‘రచ్చబండ’కు శ్రీకారం
  • గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటన
  • ఊళ్లో దళితులతో సహపంక్తి భోజనం


ఓరుగల్లు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/గీసుగొండ/ పోచమ్మమైదాన్‌/చింతలపాలెం, మే 21: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు ప్రజల్లో ఉండిపోతే తన పేరును ఎవరూ గుర్తుపెట్టుకోరని కేసీఆర్‌ భావిస్తున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. జయశంకర్‌ పేరును కాలగర్భంలో కలపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కుట్రలు పన్నుతున్నాడని, అందులో భాగంగానే ఆయన సొంత గ్రామాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచాడని విమర్శించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని జయశంకర్‌ స్వగామం అయిన అక్కంపేటలో రేవంత్‌రెడ్డి శనివారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 6న ‘వరంగల్‌ రైతు డిక్లరేషన్‌’లో పేర్కొన్నట్టు రైతు కూలీలు, కౌలు రైతులను ఎలా ఆదుకుంటామో తెలియజెప్పేందుకే రచ్చబండను చేపట్టామని తెలిపారు. జయశంకర్‌ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని అక్కంపేట నుంచి మొదలు పెట్టామని స్పష్టం చేశారు. గతంలో డిప్యుటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరి, స్పీకర్‌ మధుసూదనాచారిలు.. అక్కంపేటను సందర్శించి జయశంకర్‌ విగ్రహం, స్మృతి వనం నిర్మాణంతోపాటు అనేక అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇది జీర్ణించుకోని కేసీఆర్‌.. వారి పదవులను ఊడగొట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి అక్కంపేట గ్రామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ‘‘ఊళ్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించారా..?. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా..? జూనియర్‌ కాలేజీ నిర్మించారా..?’’ అని అడిగారు. ఇవ్వలేదని గ్రామస్థులు తెలిపారు. ఏమీ ఇవ్వని కేసీఆర్‌ను చెప్పుతీసుకుని కొట్టాలా.. వద్దా..? అని అన్నారు. 


కొట్టాలనే వాళ్లు చెప్పులను పైకెత్తాలన్నారు. దీంతో కొందరు చెప్పులు పైకెత్తి చూపారు. అక్కంపేటలో దళితులు, యాదవుల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు. ఊళ్లో మిషన్‌ భగీరథ నల్లా లేదని, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టలేదని, ఇంటికో ఉద్యోగం రాలేదని, కనీసం తినడానికి బుక్కెడు బువ్వలేదని మండిపడ్డారు. గ్రామాన్ని తాము దత్తత తీసుకుంటున్నామని రేవంత్‌ ప్రకటించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, సీఎం కేసీఆర్‌ వంద తలలున్న రావణాసురుడని మండిపడ్డారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, కేసీఆర్‌ వంద తలలను ఛేదించడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ముఖ్యంగా దళితులు సంక్షేమ పథకాలు అందక ఆర్థికంగా, సామాజికంగా చితికిపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో 80 వేల మంది రైతులు చనిపోయారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సిగ్గు లేకుండా చెప్పారని ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, ఎరువుల నుంచి రక్షణ కల్పించడానికి పంటల బీమా ఉండాల్సింది పోయి.. రైతు చనిపోతే బీమా ఇస్తున్నారని విమర్శించారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రైతు డిక్లరేషన్‌ ఏర్పాటు చేశామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైతే ఇచ్చే గిట్టుబాటు ధరలను చదివి వినిపించారు. ధరణి పోర్టల్‌ను గంగలో కలుపుతామని అన్నారు. 


రాహుల్‌గాంధీని తీసుకొస్తా.. 

అక్కంపేటలో పర్యటించిన రేవంత్‌.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ కరపత్రాలను పంపిణీ చేశారు. అధికారంలోకి రాగానే డిక్లరేషన్‌లోని అంశాలను అమలు చేస్తామని చెప్పారు. గ్రామంలోని నిరుపేద దళితుడు చిలువేరు జానీ గుడిసెలో ఆయన కుటుంబంతో కలిసి భోజనం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రాహుల్‌గాంధీని అక్కంపేటకు తీసుకొస్తానని రేవంత్‌ ప్రకటించారు. గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆరాచకాలు పెరిగిపోయాయని, ఆయన అండతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలుదళితులపై దాడులు చేస్తున్నారని అన్నారు. బాధితులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుదని చెప్పారు.


ల్యాండ్‌ పూలింగ్‌పై తీర్మానాలు చేయండి

ల్యాండ్‌ పూలింగ్‌కు వ్యతిరేకంగా రైతులు గ్రామ సభల్లో తీర్మానాలు చేస్తే సీఎం కేసీఆర్‌ జేజమ్మ వచ్చినా భూములు తీసుకోలేరని రేవంత్‌రెడ్డి అన్నారు. రచ్చబండలో పాల్గొన్న ఆయన.. తిరుగు ప్రయాణంలో వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచర్ల, వరంగల్‌ మూడో డివిజన్‌ కొత్తపేటలో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు కోల్పోతున్న రైతులు రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం భూములు తీసుకోవచ్చని, అయితే ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకొనే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు.

Updated Date - 2022-05-22T09:08:16+05:30 IST