పది అర్హత లేని ఆశా వర్కర్లకు శిక్షణ

ABN , First Publish Date - 2021-12-03T05:38:09+05:30 IST

పదో తరగతి అర్హతలేని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం(ఒపెన్‌స్కూల్‌) ద్వారా మూడు స్థాయిల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని తెలిపారు.

పది అర్హత లేని ఆశా వర్కర్లకు శిక్షణ
మాట్లాడుతున్న డీఈవో గంగాభవాని

గుంటూరు(విద్య), డిసెంబరు 2: పదో తరగతి అర్హతలేని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం(ఒపెన్‌స్కూల్‌) ద్వారా మూడు స్థాయిల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని తెలిపారు. గురువారం డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో ఆశా వర్కర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బేసిక్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులైన లెవల్‌ ఏ(3వ తరగతి), లెవల్‌ బీ(5వ తరగతి) లెవల్‌ సీ(8వ తరగతి కోర్సుల్లో 50 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో  376 మంది వర్కర్లకు వారు పనిచేస్తున్న గ్రామంలోని ప్రభుత్వ స్కూల్స్‌లో శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్‌ డాక్టర్‌ పద్మావతి, సార్వత్రిక విద్యాపీఠం రాష్ట్ర కోఆర్దినేటర్‌ రాజేశ్వరి, జిల్లా కోఆర్డినేటర్‌ రవికుమార్‌, గుంటూరు ఎంఈవో ఖుద్దూస్‌, ఆరోగ్యశాఖ ఎక్స్‌టెన్షన్‌ అధికారులు చంద్రశేఖర్‌, కమ్యూనిటీ మోబిలైజర్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

దూరవిద్య ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం(ఒపెన్‌స్కూల్‌) ఆధ్వర్యంలో దూరవిద్య విధానంలో  పది, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో గంగాభవాని తెలిపారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబరు 5లోగా, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబరు 12లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంటర్‌లో ప్రవేశానికి  పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో బోధన ఉంటుందని తెలిపారు. వివరాల కోసం డీఈవో కార్యాలయంలోని ఓపెన్‌ స్కూల్‌ సొసైటీలో లేదా తమ సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో సంప్రదించాలన్నారు. 


Updated Date - 2021-12-03T05:38:09+05:30 IST