ముంపు తప్పదా?
ABN , First Publish Date - 2022-06-30T05:52:56+05:30 IST
ముంపు తప్పదా?
డెక్క, కిక్కిసతో నిండిన పెదలంక మేజర్ డ్రెయిన్
ఆందోళనలో రైతులు..పట్టించుకోని అధికారులు
ముదినేపల్లి, జూన్ 29: పెదలంక మేజర్ డ్రెయిన్ పది కిలోమీటర్ల మేర గుర్రపు డెక్క, కిక్కిసతో నిండిపోయింది. దీంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. డ్రెయినేజీ అధికారులు పట్టించుకోకపోవడం లేదని, రెండేళ్లుగా ఈ డ్రెయిన్ కింద ఆయకట్టు భూములు భారీగా ముంపు బారిన పడి సార్వా పంట చేతికి రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. దిగువన సముద్రంలో కలిసే చోట డ్రెడ్జింగ్ చేస్తున్నా..ఇసుక మేట వేసుకుపోయి, మట్టి దిబ్బలతో నిండిన కోరుకొల్లు ఎగువ ప్రాంతాన్ని అధికారులు పట్టించుకోకపోవటంతో ముదినేపల్లి, బంటుమిల్లి, పెడన మండలాలకు చెందిన వేలాది ఎకరాల పంట భూములకు ఏటా ముంపు తప్పడం లేదు. అధిక వర్షాలకు డ్రెయి న్ పొంగితే ఉప్పరగూడెం నుంచి ఆవకూరు వరకు పొలాల నుంచి చుక్కనీరు కదలదు. దేవపూడి వంతెన వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్క, అక్కడి నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం దట్టంగా పెరిగిన కిక్కిస వల్ల నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గుడ్లవల్లేరు, పెడన, ముదినేపల్లి, కృత్తివెన్ను, బంటుమిల్లి, కలిదిండి మం డలాలకు చెందిన 90 వేల ఎకరాల ఆయకట్టుకు గతంలో మురుగునీటి సౌకర్యం కల్పించేది ఈ మేజర్ డ్రెయిన్. దీనికింద తరచూ ఏర్ప డుతున్న ముంపు వల్ల ఇరవై ఏళ్లుగా 60 వేల ఎకరాల విస్తీర్ణం చేపలు, రొయ్యల చెరువులుగా మారింది. మిగిలిన 30 వేల ఎక రాల ఆయకట్టుకూ ఈ డ్రెయిన్ మురుగు సౌకర్యం కల్పించలేదని స్థితిలో ఉంది. అధికారులు యంత్రాల సహాయంతో డ్రెయిన్లో గుర్రపు డెక్క, కిక్కిస తొలగించకపోతే సార్వా నాట్లు కూడ వేయలేమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.