రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2020-11-27T06:00:04+05:30 IST
మండలంలోని అన్నవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్ఐ హజరత్తయ్య తెలిపారు.
రొంపిచర్ల, నవంబరు 26: మండలంలోని అన్నవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్ఐ హజరత్తయ్య తెలిపారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కొక్కంటి శ్రీనివాసులు(51), చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన తండ్లం సుబ్రహ్మణ్యం(53) మృతి చెందారు. వీరు హైదరాబాద్ నుంచి కారులో ఒంగోలు వైపు వెళ్తుండగా గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నవరప్పాడు ఓవర్ బ్రిడ్జి దిగిన తరువాత ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లో ఓ శుభకార్యానికి వెళ్ళి వస్తూ స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందగా అన్నంకి వెంకటరమణ, హైదరాబాద్కు చెందిన డ్రైవర్ మంగలి వెంకటరమణలకు గాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయి ఉండటంతో లారీని ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ వాహనం అక్కడ లేదు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని నరసరావుపేటలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అన్నంకి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాలను నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.