మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే అభివృద్ధి
ABN , First Publish Date - 2022-07-01T06:26:59+05:30 IST
ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ కర్నూలు లోక్సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ కర్నూలు ఇన్చార్జి టీజీ భరత్ అన్నారు.
టీడీపీ సభ్యత్వ నమోదులో సోమిశెట్టి, టీజీ భరత్
కర్నూలు(అగ్రికల్చర్), జూన్ 30: ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ కర్నూలు లోక్సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ కర్నూలు ఇన్చార్జి టీజీ భరత్ అన్నారు. గురువారం కర్నూలు నగరంలోని రెండో వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయా కాలనీల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా.. లేకున్నా టీజీ కుటుంబం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటోందన్నారు. వచ్చే ఎన్నికలో కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో మూడేళ్లుగా అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని అన్నారు. తమ సంస్థల తరపున కర్నూలు నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో 2వ వార్డు కార్పొరేటర్ అబ్దుల్ లతీఫ్, వార్డు పార్టీ ఇన్చార్జి అబ్దుల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.