టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2022-07-07T05:21:16+05:30 IST

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం రసూల్‌పల్లె పంచాయతీలో బుధవారం 32 కుటుంబాలు పుత్తా ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి.

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం
రసూల్‌పల్లెలో పుత్తా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

ప్రజాచైతన్య యాత్రలో టీడీపీలో భారీగా చేరికలు

సికెదిన్నె, జూలై 6: టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం రసూల్‌పల్లె పంచాయతీలో బుధవారం 32 కుటుంబాలు పుత్తా ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తున్న వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతులను పూర్తిగా నష్టాలపాలు చేయాలని ఆలోచిస్తోందని దు య్యబట్టారు. రైతులు మీటర్ల ద్వారా కరెంటు ఛార్జీ చెల్లించాల్సి వస్తే ఐదు హార్స్‌పవర్‌కు దాదాపు 10 వేల వరకు బిల్లు చెల్లించాల్సి వస్తుందని 20 హార్స్‌పవర్‌కు రూ.40 వేలు దాకా బిల్లు చెల్లించాల్సి వస్తుందని, రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వస్తుందో లేదో తెలియదు కానీ మీటరు బిగిస్తే మాత్రం రైతులు కరెంటు బిల్లు కట్టలేక అప్పులపాలు కావాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పేద ముస్లింల వివాహానికి టీడీపీ ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చేదని, ప్రస్తుతం రూ.లక్ష ఇస్తానన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నిలిపివేసిందన్నారు. హిందువులకు సంక్రాంతి కానుక, క్రైస్తవుల కు క్రిస్మస్‌ కానుక, ముస్లింలకు రంజాన్‌ కానుక ఇచ్చేవారని నేడు పేదలు పండుగ చేసుకునే కానుకలు పూర్తిగా నిలిపివేసిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ డాక్టర్‌సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ కృష్ణకిశోరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, పుత్తా లక్ష్మిరెడ్డి, మోహన్‌బాబు, ఎర్రసుబ్బారెడ్డి, గోపాల్‌రెడ్డి, రాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:21:16+05:30 IST