చదువుతోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2022-06-28T05:46:01+05:30 IST

విద్యతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అన్నారు.

చదువుతోనే అభివృద్ధి సాధ్యం
అమ్మఒడి నిధుల చెక్కును తల్లులకు అందిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌, డీఈవో రమేశ్‌

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

జిల్లాలో 99,706 మంది తల్లుల ఖాతాల్లో రూ.149.55 కోట్లు అమ్మఒడి సొమ్ము జమ 

 

పాడేరు, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): విద్యతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమ్మఒడి మూడో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించగా, స్థానిక కలెక్టరేట్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని అమ్మఒడి లబ్ధిదారులతో కలిసి కలెక్టర్‌ వీక్షించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 22 మండలాల పరిధిలో మూడు వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయన్నారు. అక్షరాస్యత 44 శాతం మాత్రమే ఉందన్నారు. అందువల్ల రానున్న నాలుగైదేళ్లలో సంపూర్ణ విద్యాభివృద్ధి సాధించాలని సూచించారు. పాఠశాలల అభివృదిలో భాగంగా ప్రభుత్వం మనబడి నాడు- నేడులో ఒక్కొక్క పాఠశాలకు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసి అందంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ రమేశ్‌ మాట్లాడుతూ రెండో విడత మనబడి నాడు- నేడులో 243 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా అమ్మఒడి లబ్ధిదారులైన 99 వేల 706 మంది తల్లులకు రూ.149 కోట్ల, 55 లక్షల 90 వేల చెక్కును కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌, డీఈవో రమేశ్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి అప్పలరాము, ఎంఈవోలు సీహెచ్‌ సరస్వతిదేవి, ఎస్‌.రామచంద్రరావు, తలారిసింగి ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం రీమలి జాన్‌, చింతలవీధి సర్పంచ్‌ సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T05:46:01+05:30 IST