చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: గౌరు
ABN , First Publish Date - 2022-08-08T05:47:39+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రాభివృధ్ది సాధ్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ అన్నారు.
కొత్తపల్లి, ఆగస్టు 7: టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రాభివృధ్ది సాధ్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ అన్నారు. ముసలిమడుగు గ్రామంలో మౌళానా ముస్తాక్ అహ్మద్కు గ్రామస్థులు గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి గౌరు వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలోనే మైనారిటీల అభివృద్ధి జరిగిందన్నారు. మైనారిటీల విదేశీ విద్య, దుల్హన్ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వంలో ఎరువుల రేట్లు పెంచి, ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా చేశారని ధ్వజమెత్తారు. నిత్యావసర ధరలు పెంచి పేదల నడ్డి విరిచారన్నారు. ఇప్పటికే జగన్ పాలనపై ప్రజలు విరక్తి చెందారని, వచ్చే ఎన్నకల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. టీడీపీ నాయకులు మోమిన్ ముస్తఫా, ముక్తర్ అహ్మద్ రామకృష్ణారెడ్డి, షఫీవుల్లా మహిళా నాయకులు విజయ గౌరి, షబానాతో పాటు కడప, గుంటూరు ఒంగోలు కావల, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆదోని తదితర ప్రాంతాల నుండి టీడీపీ నాయకులు తరలి వచ్చి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.