Maharashtra : ఏక్నాథ్ షిండే మంత్రివర్గ విస్తరణ త్వరలో : దేవేంద్ర ఫడ్నవీస్
ABN , First Publish Date - 2022-07-05T19:38:15+05:30 IST
మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde)
నాగపూర్ : మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తన మంత్రివర్గాన్ని త్వరలో విస్తరిస్తారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) మంగళవారం తెలిపారు. విదర్భ (Vidarbha) ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. షిండే నేతృత్వంలోని ప్రభుత్వం శాసన సభలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే.
దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలం నాగపూర్ (Nagpur). నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన మొదటిసారి ఇక్కడికి వచ్చారు. విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. షిండే నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని విదర్భ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు.
దేవేంద్ర ఫడ్నవీస్, అమృత దంపతులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆయన మద్దతుదారులు విజయ యాత్రను నిర్వహించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు. ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు శివసేన (Shiv Sena) నుంచి విడిపోయి, బీజేపీ (BJP)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.