తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-04-18T02:20:20+05:30 IST

తిరుమలలో దాదాపు పదిరోజుల తర్వాత భక్తుల రద్దీ తగ్గింది. ఈనెల 9వ తేదీ నుంచి కొండపై రద్దీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో దాదాపు పదిరోజుల తర్వాత భక్తుల రద్దీ తగ్గింది. ఈనెల 9వ తేదీ నుంచి కొండపై రద్దీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుసగా సెలవులు రావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడింది. అయితే ఈ రద్దీ ఆదివారం ఉదయానికి భారీగా తగ్గింది. సాయంత్రం ఆరు గంటల సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దాదాపు ఐదు గంటల దర్శన సమయం పడుతోంది. పదిరోజులపాటు భక్తులతో రద్దీగా దర్శనమిచ్చిన క్షేత్రం సాధారణస్థితికి చేరుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు శనివారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు 76,746 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే 31,574 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, రూ.4.62 కోట్ల హుండీ ఆదాయం లభించిందని పేర్కొంది. 

Updated Date - 2022-04-18T02:20:20+05:30 IST