రాత్రి కర్ఫ్యూపై డీజీపీ వీడియో కాన్ఫరెన్సు
ABN , First Publish Date - 2021-04-21T06:22:02+05:30 IST
కరోనా వైరస్ ఉధృతి నియంత్రణ కోసం మే 1 వరకు నిర్వహించనున్న రాత్రివేళ కర్ఫ్యూపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్రెడ్డి అన్నారు.
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 20: కరోనా వైరస్ ఉధృతి నియంత్రణ కోసం మే 1 వరకు నిర్వహించనున్న రాత్రివేళ కర్ఫ్యూపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్రెడ్డి అన్నారు. కర్ఫ్యూ అమలుపై అవగాహన లేనివారికి తొలుత తెలియజేయాలని సూచించారు. కర్ఫ్యూపై డీజీపీ పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కర్ష్యూను అమలు చేయాలన్నారు. వివిధ కమిషనరేట్లు, జిల్లాల్లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. ప్రజలు మాస్కులు ధరించడం, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవడం, స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవడం ద్వారానే ఈ వైరస్ ఉధృతి అదుపులోకి వస్తుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి అన్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కమిషనరేట్ వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. అత్యవసర విభాగాలకు చెందిన వారికి కర్ఫ్యూ సందర్భంగా కొన్ని సడలింపులు ఉన్నాయని, అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు, కొన్ని వాహనాలకు సంబంధించి సడలింపులు ఉన్నాయని తెలిపారు. ఆ విభాగాలకు చెందిన ఉద్యోగులు విధిగా వెంట గుర్తింపు కార్డులను ఉంచుకోవాలని, పోలీసులు అడిగిన సందర్భాలలో సూచించడమే కాకుండా పని అవసరాలను తెలుపాలని చెప్పారు. ఏదైనా ఆపద లేదా సమస్యలు ఉత్పన్నయితే డయల్ 100కు సమాచారం అందించినట్లయితే నిమిషాల వ్యవధిలో సదరు ప్రాంతాలకు చేరుకుని సేవలందించనున్నామని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే వారికి మినహాయింపునిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ(ఎల్అండ్ఓ) ఎస్ శ్రీనివాస్, ఏఎస్పి రితిరాజ్, ఎస్బీఐ వి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు సీహెచ్ నటేశ్, మురళి, సుధాకర్లతోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.