అక్కడ భూ సమస్యనా.. అయితే డోంట్ వర్రీ

ABN , First Publish Date - 2022-04-09T22:47:48+05:30 IST

అత్యధిక భూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆ జిల్లా. బంగారం కంటే పది రెట్లు విలువైన ధరలు ఆ భూముల సొంతం. వందల మంది ..

అక్కడ భూ సమస్యనా.. అయితే డోంట్ వర్రీ

  • ధరణీలో ఫిర్యాదు చేశారా? ఇక మీకు నో టెన్షన్
  • హాట్ కేకుల్లాంటి జిల్లాలో ధరణి అద్భుతాలు
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ చొరవ
  • రాష్ట్రంలోనే జిల్లాకు ప్రత్యేక స్థానం.. 

అత్యధిక భూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆ జిల్లా. బంగారం కంటే పది రెట్లు విలువైన ధరలు ఆ భూముల సొంతం. వందల మంది వీవీఐపీల భూముల సమస్యలు ప్రతి రోజూ ఆ కార్యాలయం తలుపు తడుతూ ఉంటాయి. ఆ జాగాలు రియల్ ఎస్టేట్ మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తాయి. చిన్న సంతకం పెడితే చాలు అధికారుల టేబుళ్లన్నీ పచ్చనోట్లతో నిండిపోతాయి. అలాంటి జిల్లాలో ఎలాంటి వివాదం లేకుండా 95 శాతం భూముల సమస్యలను అత్యంత సులువుగా పరిష్కరించడం సాధ్యమేనా?  రాజకీయ ఒత్తిళ్లు తట్టుకుని నిలబడటం అధికారుల వల్ల అవుతుందా?, నోట్ల కట్టలను ఎర వేసినా నిజాయితీగా పని చేసే అధికారులు అక్కడ డ్యూటీ చేయగలరా?,  అవును సమస్యను సులువుగా పరిష్కరించొచ్చు. ఒత్తిళ్లను తట్టుకుని నిలబడొచ్చు. నిజాయితీగా డ్యూటీ కూడా చేయొచ్చు.. ఐఏఎస్ అమోయ్ కుమార్‌లాంటి వ్యక్తులుంటే అవన్నీ సాధించొచ్చు. ధరణి పోర్టలో 95 శాతం సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా, ఆ జిల్లాను ఎలాంటి మచ్చ లేకుండా పాలిస్తున్న అమోయ్ కుమార్‌పై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..


భూ సమస్యలు పరిష్కారం కావాలంటే అయితే చెప్పులు అరిగేలా అయినా తిరగాలి.. లేదా అడిగినంత అయినా సమర్పించాలి. ఎంత కష్టపడ్డా ఒక్కోసారి నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాలి. అయినా కూడా సమస్య పరిష్కారం అవుతుందన్న గ్యారంటీ లేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది సర్కార్. భూ సమస్యల పరిష్కారానికి బాధితుల సమయం, డబ్బు ఆదా కావాలని, పారదర్శకంగా మేలు జరగాలని సర్కార్ ధరణిని ప్రారంభించింది. ధరణి వచ్చిన తర్వాత అధికారుల్లో సమన్వయం రావడంతో పనులన్నీ సులువుగా అవుతున్నాయి. 


దీంతో ఏళ్ల తరబడి భూ సమస్యలు పరిష్కారం అవుతూ ఉండటంతో అధికారులు, బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా భూ సమస్యలను వేగంగా పారదర్శకంగా పరిష్కరించిన జిల్లాల్లోమొదటి స్థానంలో ఉంది. రంగారెడ్డి తర్వాత మిగతా ఏ జిల్లాలు కూడా దాని దరిదాపుల్లోనే లేవు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 125185 దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా వచ్చాయి. ఇందులో లక్షా 20 వేల 518 దరఖాస్తులను అతి తక్కువ సమయంలోనే క్లియర్ చేశారు. 74 వేల 205 దరఖాస్తులకు అనుమతులు కూడా ఇచ్చేశారు. వివిధ కారణాలతో 46 వేల 313 దరఖాస్తులను అధికారులు టెక్నికల్ సమస్యతో వాటిని తిరస్కరించారు.   


క్లియరెన్స్ ఇచ్చిన దరఖాస్తుల్లో కేవలం 4667 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వీటి శాతం దాదాపు 96‌గా ఉంది. దీన్ని బట్టే భూముల క్లియరెన్స్‌లో ఎలాంటి పారదర్శకత పాటిస్తున్నారో ఇట్టే అర్థం అవుతోంది. మరోవైపు ప్రజావాణీలోనూ కొందరు భూముల సమస్యలపై ఫిర్యాదు చేస్తే.. అవి చకచకా పరిష్కారం అవుతున్నాయి. ఇలా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టి తన సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ధరణి పోర్టల్‌లో ఉండే సమస్యలను పరిష్కరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. చాలా భూములు కబ్జాకు గురయ్యాయి. వాటన్నింటినీ వెలికి తీసి సమస్యలను పరిష్కరించడం అంటే మాటలు కాదు. అవన్నీ అమోయ్ కుమారే స్వయంగా పరిశీలిస్తూ చక్కదిద్దుతున్నారు. 


ధరణి పోర్టల్‌లో భూ సమస్య ప్రత్యక్షం అయ్యిందంటే చాలు దాని పుట్టుపూర్వోత్తరాలపై వెంటనే క్షేత్ర స్థాయి పరిశీలన జరుపుతున్నారు. కింది స్థాయి సిబ్బందికి నేరుగా ఆదేశాలు ఇస్తూ ఫీల్డ్ విజిట్ చేయిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం అయిన వెంటనే పాస్ బుక్ జారీ చేసేస్తున్నారు. ధరణి పోర్టల్‌ను ప్రత్యేకంగా స్టడీ చేయడంతో పాటూ టెక్నికల్‌గా అన్ని విషయాలపైనా కలెక్టర్ అమోయ్ కుమార్ పట్టు సాధించారు. అందుకే ఎటు వెళ్లినా, కార్ లోనే చకచకా పోర్టల్ ఓపెన్ చేసి ఇష్యూను క్లియర్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 96 శాతం ల్యాండ్స్ క్లీన్ గా ఉంచడమంటే మాటలు కాదు. అందులోనూ అందరి కళ్లూ ఉన్న రంగారెడ్డి లాంటి జిల్లాల్లో వివాదాలకు అవకాశం లేకుండా ధరణి పోర్టల్‌లో ఫైళ్లను క్లియరెన్స్ ఇవ్వడమంటే మాటలు కాదు. సీఎం కేసీఆర్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి శేషాద్రి ప్రోత్సాహం, సీఎంవో అధికారుల సూచనలతోనే ఆయన చకచకా పనులను చేయగలుగుతున్నారు. భూ సమస్యల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన వారికి ధరణి చాలా ఉపశమనం కలిగిస్తోంది. ధరణికి ముందు, ధరణికి తర్వాత జరిగిన మార్పులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయితే పోర్టల్ రావడం వేరు.. దాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం వేరు. అందులోనూ జెట్ స్పీడ్‌తో ఇష్యూను క్లియర్ చేయడం వేరు. అలా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ చొరవ జిల్లాను మొదటి స్థానంలో ఉంచేలా చేసింది.


Updated Date - 2022-04-09T22:47:48+05:30 IST