డయల్ 182
ABN , First Publish Date - 2020-10-27T10:10:16+05:30 IST
‘‘మీరు రైలులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా... మీకేం భయం లేదు... 182 నెంబరుకు ఫోన్ చేయండి చాలు...
మహిళా రైలు ప్రయాణికుల భద్రతకు భరోసా
అడ్డగుట్ట, అక్టోబర్ 26 (ఆంధ్రజ్యోతి): ‘‘మీరు రైలులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా... మీకేం భయం లేదు... 182 నెంబరుకు ఫోన్ చేయండి చాలు... వచ్చే స్టేషన్లో మహిళా కానిస్టేబుళ్లు మీకు భద్రతగా ఉంటారు’’ అని దక్షిణ మధ్య రైల్వే ఐజీ ఈశ్వరరావు మహిళలకు సూచిస్తున్నారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను సందర్శించారు. దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన ‘‘మేరీ సహేలీ’’ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలులో మహిళ ప్రయాణికులతో ఆయన మాట్లాడి అవగాహన కల్పించారు. రైలు ప్రయాణంలో ఏదైనా ఆపద వస్తే వెంటనే 182కు ఫోన్ చేయాలని సూచించారు. తోటి ప్రయాణికులు తినుబండారాలు ఇస్తే తీసుకోవద్దని, లగేజీలను ఎప్పటికప్పుడు చూసుకోవాలని సూచించారు. ‘మేరీ సహేలీ’ మొదటగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గోదావరి, గొల్కొండ, హౌరా ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రవేశపెట్టామని చెప్పారు. ఐజీ వెంట రైల్వే సీనియర్ జనరల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గాంధీ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బెన్నన్, శేషుబాబులతో పాటు ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.