వజ్రాల పేరుతో టోకరా

ABN , First Publish Date - 2020-10-25T11:01:44+05:30 IST

తక్కువ ధరకు నాణ్యమైన వజ్రాలు అంటూ ఓ వ్యాపారిని బురిడీ కొట్టించిన ఘటన తాటిచెర్లమోటు సమీపంలో జరిగింది.

వజ్రాల పేరుతో టోకరా

నకిలీవి ఇచ్చి రూ.20వేలు కాజేసిన ఘనుడు


గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 24 : తక్కువ ధరకు నాణ్యమైన వజ్రాలు అంటూ ఓ వ్యాపారిని బురిడీ కొట్టించిన ఘటన తాటిచెర్లమోటు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఒంగోలుకు చెందిన పొగాకు వ్యాపారి గాలి నరేష్‌కు గుంటూరు జిల్లా గురజాలకు చెందిన గొరియా నాయక్‌ పరిచయం అయ్యాడు. ఇద్దరు తరచూ మాట్లాడుకునే వారు. తనకు తెలిసిన వాళ్ల వద్ద వజ్రాలు ఉన్నాయని, వాటి ఖరీదు చాలా ఎక్కువ ఉంటుందని, కావాలంటే తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో పొగాకు వ్యాపారి నరేష్‌ ఆశపడ్డాడు.


ఇద్దరు ఓ దగ్గర కలుసుకునేందుకు నిర్ణయించుకున్నారు. శనివారం ఇద్దరు గిద్దలూరు సమీపంలోని తాటిచెర్ల వద్దకు వచ్చారు. గొరియా నాయక్‌ వద్ద ఉన్న నకిలీ వజ్రాలను ఒరిజినల్‌గా చెప్పి రమేష్‌కు అందించాడు. దీంతో నరేష్‌ రూ.20 వేలు నాయక్‌కు ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత నరేష్‌ ఆ వజ్రాలను తీసుకుని తనకు తెలిసిన బంగారు వ్యాపారి వద్దకు వెళ్లి చూపించాడు. ఆ వజ్రాలు నకిలీవిగా నిర్ధారించిన బంగారు వ్యాపారి చెప్పడంతో నరేష్‌ అవాక్కయ్యాడు. జరిగిన ఉదంతాన్ని గిద్దలూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ రవీంద్రరెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ రవీంద్రరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-25T11:01:44+05:30 IST