కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు ‘డయానా’ అవార్డు
ABN , First Publish Date - 2021-06-29T09:37:40+05:30 IST
రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా’ అవార్డు దక్కింది.
తండ్రిగా గర్వపడుతున్నా: మంత్రి
హైదరాబాద్, జూన్28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా’ అవార్డు దక్కింది. దివంగత బ్రిటిష్ యువరాణి డయానా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ అవార్డును ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన తొమ్మిది నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండే వారికి ఇస్తారు. వారు సమాజానికి అందించే సేవలకు గుర్తింపుగా, ఎంపిక చేసి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు ఈ సారి హిమన్షు కూడా ఎంపికయ్యారు. గ్రామాల్లో స్వయంసమృద్ధి దిశ కోసం చేపట్టాల్సిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘శోమ’ పేరుతో హిమాన్షు స్వయంగా ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గం గంగాపూర్, యూసుఫ్ఖాన్ పల్లి గ్రామాల్లో ఆయన పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఈ ప్రాజెక్టు కోసం తనకు సంపూర్ణ మార్గదర్శనం చేసిన తన తాత, ముఖ్యమంత్రి కేసీఆర్కు హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాలు స్వయం సమృద్థి సాధించేందుకు తనకున్న ఆలోచనల మేరకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలకు, తన గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. అవార్డుతో గుర్తింపు తెచ్చుకున్నందుకు హిమాన్షుకు అభినందనలు తెలుపుతున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. మరిన్ని విజయాలు సాధించాలన్నారు. ప్రౌడ్ఫాదర్ (తండ్రిగా గర్విస్తున్నా)అంటూ హ్యాష్ట్యాగ్ జోడించారు. హిమాన్షుకు ఆయన మిత్రులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.