Oh Dictator...మీ అహంకారం అణుచుతాం: మోదీపై కాంగ్రెస్ ఫైర్

ABN , First Publish Date - 2022-06-15T20:40:03+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసులో మూడో రోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్‌ గాంధీపై విచారణ కొనసాగిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు..

Oh Dictator...మీ అహంకారం అణుచుతాం: మోదీపై కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మూడో రోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై విచారణ కొనసాగిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన తీవ్రం చేస్తున్నారు. దేశ రాజధానిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద పెద్దఎత్తున నిరసనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు బుధవారంనాడు కాంగ్రెస్ ప్రధానకార్యాలయంలోకి బలవంతంగా చొచ్చుకువచ్చారు. దీనిపై పార్టీ అగ్రనేతలు మోదీపై మండిపడ్డారు. బీజేపీ సారథ్యంలోని కేంద్రాన్ని "నియంతలు'' (Dictators) అంటూ నిప్పులు చెరిగారు. పోలీసులు పార్టీ ప్రధాన కార్యలయంలోకి బలవంతంగా చొచ్చుకుపోయిన వీడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. ''ఓ నియంతా...ప్రజాస్వామ్య పీఠం నుంచి దిగిపో. ప్రజల ముందుకు రా'' అని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ పోలీసులు బలవంతంగా తమ పార్టీ కార్యాలయంలోకి దూసుకువచ్చి, తమ పూర్వీకులు పోరాటంతో, ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చారని తీవ్రంగా ఆరోపించారు.


కాగా, రాహుల్ గాంధీ మూడో రోజు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఏపీజీ అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ ప్రధాన కార్యాలయానికి మధ్యాహ్నం 11.45 గంటలకు 'జడ్' కేటగరి భద్రత మధ్య వచ్చారు. రాహుల్ వెంట ఆమె సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.


సచిన్ పైలట్ అరెస్టు..

రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తుండంపై పెద్దఎత్తున నిరసనలు కొనసాగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వైపు కార్తకర్తలతో వెళ్తుండగా పోలీసులు ఆయనను నిలిపివేశారు. కొద్దిసేపు వాగ్వాదం అనంతరం నినాదాల మధ్య పైలట్ సహా కార్యకర్తలు పోలీసు వాహనం ఎక్కారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం బయట, ఈడీ కార్యాలయం వెలుపల నిరసనలకు దిగిన పలువురు కాంగ్రెస్ కార్తలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూత్  కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ వర్కర్లను లాక్కుంటూ తీసుకెళ్లి బస్సులు ఎక్కించారు. 

Updated Date - 2022-06-15T20:40:03+05:30 IST