రబీలోనైనా రాత మారేనా?
ABN , First Publish Date - 2021-10-25T05:15:53+05:30 IST
రబీలోనైనా రైతుల రాత మారేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
- శనగ సాగులో రైతులు బిజీ బిజీ
ఓర్వకల్లు, అక్టోబరు 24: రబీలోనైనా రైతుల రాత మారేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఖరీ్ఫలో సాగు చేసిన పంటల దిగుబడులు తగ్గడంతో ఆశలన్నీ రబీపైనే పెట్టుకున్నారు. శనగ సాగులో బీజీ బిజీ అయ్యారు. మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, నన్నూరు, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, గుట్టపాడు, ఎన్.కొంతలపాడు, హుశేనాపురం, తిప్పాయపల్లె తదితర గ్రామాల్లో విత్తనాలు వేశారు. మండలంలో ఆరు వేల హెక్టార్లలో శనగ పంట సాగు చేశారు. ప్రభుత్వం అందించిన సబ్సిడీతో రైతులు విత్తనాలను సద్వినియోగం చేసుకున్నారు. ఎకరాకు శనగ విత్తనాలు విత్తేందుకు రూ.10వేలకు పైగా పంటపై పెట్టుబడి పెట్టారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు ధరలు పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం
గత ఏడాది కంటే ఈ ఏడాది రబీలో అధిక విస్తీర్ణంలో శనగ పంట సాగు చేశాం. వర్షాలు లేక ఖరీ్ఫలో సాగు చేసిన పంటల దిగుబడులు తగ్గాయి. దీంతో రైతులు అప్పుల వలయంలో కూరుకుపోయారు. ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- నర్ల మోహన్రెడ్డి, రైతు
ఖరీఫ్ సాగు రైతన్న కొంప ముంచింది
ఖరీ్ఫలో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, ఆముదం, వేరుశనగ, మినుములు రైతన్నల కొంప ముంచాయి. వర్షాలు లేక పైరు వాడుముఖం పట్టి దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి.
- మద్దిలేటి, రైతు
రైతులందరికీ విత్తనాలు పంపిణీ
ప్రతి రైతుకు ప్రభుత్వం అందిస్తున్న శనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అంది చ్చాం. రైతులకు ఇబ్బంది లేకుండా విత్తనాలు పంపిణీ చేశాం. ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా విత్తనాలు అందజేస్తున్నాం.
- సుధాకర్, ఏవో, ఓర్వకల్లు