కేసుల నమోదుతో ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-10-18T04:28:41+05:30 IST

చేర్యాల పీఏసీఎస్‌, ఐకేపీ ధాన్యం కొనుగోలు అవినీతి బాగోతం పట్ల ఆయా శాఖల అధికారులు క్రమేపీ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

కేసుల నమోదుతో ఇబ్బందులు

లావాదేవీల నిలిపివేతతో బ్యాంకు ఖాతాదారుల భయాందోళనలు

చేర్యాల, అక్టోబరు 17 : చేర్యాల పీఏసీఎస్‌, ఐకేపీ ధాన్యం కొనుగోలు అవినీతి బాగోతం పట్ల ఆయా శాఖల అధికారులు క్రమేపీ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాసులకు కక్కుర్తిపడి కిందిస్థాయి సిబ్బంది చేసిన తప్పిదానికి ఐకేపీ అధికారులు, మిల్లర్ల నిర్వాహకులు చేసిన పాపానికి పలువురు భాగస్వాములు, సన్నిహితులు బలవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అవినీతి తతంగంలో పీఏసీఎస్‌ సీఈవో, చేర్యాల, కొమురవెల్లి ఐకేపీ ఏపీఎంలు సస్పెన్షన్‌ కాగా, నాలుగు మిల్లులకు సంబంధించి 30 మందికిపైగా మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. కానీ ఆయా మిల్లుల కార్యకలాపాల నిర్వహణలో పాలుపంచుకోని భాగస్వాములపై కేసులు నమోదవడంతో ఆందోళన చెందుతున్నారు. భూమి లేకున్నా, పంట పండించకున్నా ఓ వ్యక్తి పేరు నమోదు చేసి మరో వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేసిన విషయమై పీఏసీఎస్‌ మూడు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి 65 మందిని గుర్తించి విచారణ చేపట్టారు. ఐకేపీలోనూ మరికొందరిని గుర్తించారు. తమకు ప్రమేయం లేకున్నా, జమచేసిన డబ్బులు తిరిగి మిల్లర్‌కు అందించి అవినీతికి పాల్పడిన అధికారులు, సిబ్బందిపైనే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. నిన్న, మొన్నటివరకు చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో సుమారు రూ.6 కోట్ల మేర అవినీతి చోటు చేసుకున్నదని ప్రాథమిక అంచనా వేశారు. 

ఐకేపీ ఏపీఎం, సీసీ, వీఏవో సస్పెండ్‌

మద్దూరు, అక్టోబరు 17 : దూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై ఏపీఎం ప్రసాద్‌రావు, సీసీ పోచమ్మ, వీఏవో రాములను బాధ్యులు చేస్తూ తొలగించినట్లు డీఆర్డీఏ గోపాల్‌రావు తెలిపారు. ఈ విషయమై ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐకేపీ సెంటర్‌ నుంచి అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాన్ని ఎత్తేశాక మిల్లు భాగస్వామితో కుమ్మక్కై, తప్పుడు ట్రక్‌ షీట్లతో ధాన్యం కొనుగోలు చేయకుండానే మిల్లులో దించుకున్నట్లు పంపి రూ.31 లక్షలపైనే అవకతవకలు జరిగాయన్నారు. సెంటర్‌ ఎత్తేశాక ధాన్యం ఎలా వస్తుందనే దానిపై ఏపీఎం, సీసీని బాధ్యులను చేస్తూ సస్పెండ్‌ చేసినట్లు గోపాల్‌రావు తెలిపారు. త్వరలో మిగతా కేంద్రాల్లో నిర్వహించిన కొనుగోళ్లపై విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మద్దూరు, దూళిమిట్ట మండలాల్లోని గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎ్‌సల ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ మద్దూరు, దూళిమిట్ట ఉమ్మడి మండలాల అధ్యక్షుడు, బైరాన్‌పల్లి సర్పంచ్‌ బండి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-18T04:28:41+05:30 IST