అడ్డగోలుగా హద్దు దాటి తవ్వకాలు
ABN , First Publish Date - 2021-06-15T05:42:11+05:30 IST
మండలంలోని గొడవర్రు గ్రామ పరిధిలో కృష్ణానది ఒడ్డున ఇసుక యథేచ్ఛగా తోడేస్తున్నారు.
దుగ్గిరాల, జూన్ 14: మండలంలోని గొడవర్రు గ్రామ పరిధిలో కృష్ణానది ఒడ్డున ఇసుక యథేచ్ఛగా తోడేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దు గ్రామాలైన మద్దూరు, గొడవర్రులో మూడురోజులుగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ జిల్లా అధికారులు నిర్ణయించిన సరిహద్దు లోపలే, అనుమతి చ్చిన ప్రకారమే ఇసుక తీస్తున్నామని చెప్పడంతో వెనుదిరిగారు. అధికారపార్టీ అండదండలతోనే, సరిహద్దు దాటి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయాన్ని గొడవర్రు గ్రామస్తులు దుగ్గిరాల తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం దుగ్గిరాల మండల సర్వేయర్తోపాటు, స్థానిక వీఆర్వో వెంకటేశ్వర్లు రీచ్లో తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి లారీలను, జేసీబీలను వెనక్కు పంపివేశారు. దీనిపై తహసీల్దార్ కె.మల్లీశ్వరిని వివరణ కోరగా గొడవర్రు రీచ్వద్ద రెండు జిల్లాల సరిహద్దులో ఇసుక తవ్వకాలు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండు జిల్లాల అధికారులు వచ్చి, సరిహద్దులను పరిశీలించే వరకూ తవ్వకాలు నిలిపివేయాలని చెప్పినట్లు తెలిపారు.