నకిలీ సర్టిఫికెట్లకు చెక్‌! త్వరలో డిజిలాకర్‌ వ్యవస్థ!

ABN , First Publish Date - 2022-08-17T17:21:22+05:30 IST

నకిలీ సర్టిఫికెట్ల(Duplicate certificates)కు త్వరలో చెక్‌ పడనుంది. ఉద్యోగాల భర్తీ, అడ్మిషన్ల సమయంలో అభ్యర్థులు సమర్పించే సర్టిఫికెట్లు నిజమైనవో, నకిలీవో ఈజీగా గుర్తించడానికి రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

నకిలీ సర్టిఫికెట్లకు చెక్‌! త్వరలో డిజిలాకర్‌ వ్యవస్థ!

కేంద్రం తరహాలో డిజిలాకర్‌ వ్యవస్థ!

వర్సిటీలు, కాలేజీల సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో..

సులభతరం కానున్న వెరిఫికేషన్‌ ప్రక్రియ

విద్యామండలి, పోలీసు శాఖ భాగస్వామ్యం

కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర అధికారులు

త్వరలో అందుబాటులోకి కొత్త వ్యవస్థ

ప్రైవేటు కంపెనీలకూ వెరిఫికేషన్‌ సేవలు


హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): నకిలీ సర్టిఫికెట్ల(Duplicate certificates)కు త్వరలో చెక్‌ పడనుంది. ఉద్యోగాల భర్తీ, అడ్మిషన్ల సమయంలో అభ్యర్థులు సమర్పించే సర్టిఫికెట్లు నిజమైనవో, నకిలీవో ఈజీగా గుర్తించడానికి రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలతోపాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు (Universities) జారీచేసిన సర్టిఫికెట్లన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉంచబోతున్నారు. దాంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌  విధానంలో పలు మార్పులు రానున్నాయి. ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం పటిష్టమైన వ్యవస్థ లేదు. ముఖ్యంగా 20, 30 ఏళ్ల క్రితం జారీచేసిన సర్టిఫికెట్లను పరిశీలించాలంటే... నేరుగా ఆయా యూనివర్సిటీలు, లేదా కాలేజీలకు వెళ్లి అధికారులను సంప్రదించడం మినహా మరో మార్గం లేదు. ఒకవేళ వెళ్లినా.... కాలేజీల్లో రికార్డులు సరిగా లేకపోవడం, లేదా వాటిని వెతికి చూడటంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో ఉద్యోగాల భర్తీతోపాటు ఇతర సందర్భాల్లోనూ అభ్యర్థులు సమర్పిస్తున్న సర్టిఫికెట్లను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే నియామకాలను పూర్తి చేస్తున్నారు. ఫలితంగా అనేకమంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందుతున్నారు. ఉన్నత విద్య లేదా ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లేవారి విషయంలోనూ ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అభ్యర్థులు సమర్పించే సర్టిఫికెట్లు నకిలీవని తేలితే ఆయా దేశాలకు చెందిన ఎంబసీలు రాష్ట్ర అధికారులకు సమాచారం ఇస్తున్నాయి. ఇలాంటి సంఘటనలతో రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని... కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన డిజిలాకర్‌ మాదిరిగానే రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, పోలీసు విభాగాలు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. ఇందులో భాగంగా... ఆయా వర్సిటీలు, కాలేజీలు జారీచేసిన డిగ్రీ సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి ప్రత్యేక క్లౌడ్‌లో భద్రపరిచారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తోపాటు పలు బోర్డుల ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతున్నాయి. తాజాగా డిజిటలైజేషన్‌ చేసిన సర్టిఫికెట్ల సమాచారాన్ని నియామక బోర్డులు ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.ఆయా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సంబంధించిన లింక్‌ను నియామక బోర్డులకు అందజేయనున్నారు. వారం పది రోజుల్లోనే దీన్ని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2022-08-17T17:21:22+05:30 IST