భారత్కు శ్రీజేష్ లాంటి గోల్ కీపర్ అవసరం: దిలీప్ టిర్కీ
ABN , First Publish Date - 2022-06-02T23:47:52+05:30 IST
ఆసియా కప్లో ఫైనల్ చేరడంలో విఫలమైన డిఫెండింగ్ చాంపియన్ భారత హాకీ జట్టు చివరకు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది
న్యూఢిల్లీ: ఆసియా కప్లో ఫైనల్ చేరడంలో విఫలమైన డిఫెండింగ్ చాంపియన్ భారత హాకీ జట్టు చివరకు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. నిజానికి ఈసారి ఆసియా కప్కు భారత్ ఎక్కువ మంది జూనియర్ ఆటగాళ్లను బరిలోకి దింపింది. అయినప్పటికీ, సూపర్ 4లోకి ప్రవేశించి జోరు ప్రదర్శించింది. అయితే, ఫైనల్ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన సూపర్-4 ఆఖరి మ్యాచ్లో కొరియాతో పోరును 4-4తో డ్రా చేసుకుంది. ఫైనల్కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. అయితే, కాంస్యపతక పోరులో భారత్ 1-0 గోల్ తేడాతో జపాన్పై విజయం సాధించి మూడోస్థానంలో నిలిచింది. మ్యాచ్లో నమోదైన ఏకైక గోల్ను రాజ్కుమార్ పాల్ ఏడో నిమిషంలో సాధించాడు.
భారత జట్టు ప్రదర్శనపై భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ ప్రశంసలు కురిపించాడు. భారత ఆటగాళ్లు అటాకింగ్లో అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. అయితే జట్టులో కొంత అనుభవం కూడా అవసరమని అన్నాడు. భారత్కు శ్రీజేష్ లాంటి గోల్కీపర్ అవసరమని పేర్కొన్నాడు. రాబోయే ప్రపంచ కప్, కామన్వెల్త్ క్రీడలను దృష్టిలో పెట్టుకుని ఫ్లికర్స్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
నాలుగు దశాబ్దాల నాటి జట్టును మళ్లీ చూడబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ విశ్లేషణ కోసం భారత దేశపు తొలి బహుబాషా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ కూ (Koo) యాప్ ‘హాకీ మహామంచ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ అభిషేక్ సేన్ గుప్తాతో కలిసి టిర్కీ తన అభిప్రాయాలను పై విధంగా పంచుకున్నాడు.