అంగన్వాడీ కేంద్రాలకు నేరుగా బియ్యం సరఫరా
ABN , First Publish Date - 2022-07-07T06:26:38+05:30 IST
అంగన్వాడీ కేంద్రాలకు బియ్యాన్ని నేరుగా రవాణా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు.
- నేటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు
- అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 6: అంగన్వాడీ కేంద్రాలకు బియ్యాన్ని నేరుగా రవాణా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరాపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 587 అంగన్వాడీ కేంద్రాలకు గతంలో బియ్యం సరఫరా రేషన్ దుకాణాల ద్వారా జరిగేదన్నారు. ఆప్రక్రియలో సమస్యలు తలెత్తుతున్నందున నేరుగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు బియ్యాన్ని అందించాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు రూట్ అఫీసర్లను నియమించాలన్నారు. జిల్లాలో కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇరుకు రోడ్డు ఉన్నచోట అలాంటి కేంద్రాలకు చిన్న వాహనాల్లో బియ్యాన్ని సరఫరా చేయాలని సూచించారు. సరుకు రవాణాను ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.