పంటల బీమాలో అవినీతిపై నిగ్గు తేల్చాలి
ABN , First Publish Date - 2022-06-25T06:31:29+05:30 IST
పంటల బీమాలో జరిగిన అవినీతిపై జనసేన చేసిన ఆరోపణలతో ఆలమూరు మండల సమావేశం రసాభాసగా మారింది. ఆలమూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.
- జనసేన నేతల డిమాండ్
- రైతులు సంతృప్తిగా ఉన్నారన్న వైసీపీ నేతలు
- దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాదోపవాదాలు
- రసాభాసగా ఆలమూరు మండల సమావేశం
ఆలమూరు, జూన్ 24: పంటల బీమాలో జరిగిన అవినీతిపై జనసేన చేసిన ఆరోపణలతో ఆలమూరు మండల సమావేశం రసాభాసగా మారింది. ఆలమూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. పంట భూమి లేని వారికి, అసలు రైతులే కాని వారికి పంటల బీమా సొమ్ము జమ చేశారని పినపళ్ల సర్పంచ్ సంగిత సుభాష్ ఆరోపించారు. పంటల బీమాలో అవినీతిపై నిగ్గు తేల్చాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేనకు చెందిన 8 మంది ఎంపీటీసీలు, నలుగురు సర్పంచ్లు తహశీల్దార్, ఎంపీడీవోలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిని ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, మండల వ్యవసాయ కమిటీ చైర్మన యనమదల నాగేశ్వరరావు, గుమ్మిలేరు సర్పంచ గుణ్ణం రాంబాబు, మోదుకూరు సొసైటీ చైర్మన నెల్లి రాజు వ్యతిరేకించారు. పంటల బీమాతో రైతులు సంతృప్తిగా ఉన్నారని వారు చెప్పారు. అవినీతిపై ఫిర్యాదు చేస్తే సమర్ధిస్తారా అని జనసేన నాయకులు మండిపడ్డారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తమని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. సంధిపూడి మెయిన్రోడ్డులో ఆక్రమణలను అరికట్టాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని సర్పంచ్ తోట భవాని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య మరికొంతసేపు వాదనలు జరిగాయి. సమావేశంలో జడ్పీటీసీ తోరాటి సీతామహాలక్ష్మి, ఏఎంసీ చైర్పర్సన తమ్మన సుబ్బలక్ష్మీశ్రీనివాస్, ఎంపీడీవో జేఏ ఝాన్సీ, తహశీల్దార్ లక్ష్మీపతి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.