జిల్లాల పునర్విభజనపై కసరత్తు
ABN , First Publish Date - 2020-11-05T13:45:45+05:30 IST
జిల్లాల పునర్విభజన కసరత్తుల్లో భాగంగా..
భూములు, ఖాళీ స్థలాలు, భవనాల లెక్క త్వరగా తేల్చండి
ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన జిల్లా యంత్రాంగం
మొదలైన డేటా ప్రాసెసింగ్
అధికారులతో సమీక్షించిన కలెక్టర్
విజయవాడ, ఆంధ్రజ్యోతి: జిల్లాల పునర్విభజన కసరత్తుల్లో భాగంగా డేటా ప్రాసెసింగ్ మొదలైంది. ఇందులో భాగంగా ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు, భవనాల జాబితా అప్లోడింగ్ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు డివిజన్ల పరిధిలో ఈ ప్రక్రియ అంత వేగంగా జరగటం లేదు. ఒక్క గుడివాడ డివిజన్లోనే వేగంగా ఉంది. ఈ విషయాన్ని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం దృష్టికి తెచ్చింది. దీంతో కలెక్టర్ ఇంతియాజ్ ఆగమేఘాలపై నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పునర్విభజన చర్యల్లో భాగంగా క్షేత్రస్థాయిలో కావాల్సిన సమాచారాన్ని ప్రభుత్వం ఇంతకుముందే కోరింది. అయితే, పునర్విభజనకు సంబంధించి ప్రధానంగా పరిపాలనా కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు అవసరం. ఈ వివరాలను జిల్లా నుంచి అందించటంలో డివిజనల్ స్థాయిలో కొంత జాప్యం జరిగింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి భూ, భవన సమగ్ర వివరాలను కోరారు.
ప్రత్యేక సెల్ ఏర్పాటు యోచన
భవనాలు, భూములు, ఖాళీ స్థలాలకు సంబంధించి ఎలా పడితే అలా అప్లోడ్ చేయటానికి వీల్లేదు. ఇచ్చిన డేటా ప్రామాణికతతో ఉందని చూపటానికి ఒక విధానాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రధానంగా రెవెన్యూ, వ్యవసాయ, అటవీ, వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలన్నీ తమ పరిధిలోని ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు, భవనాల వివరాలను సేకరించాల్సి ఉంటుంది. ఇలా సేకరించిన వాటిని రెవెన్యూ డివిజన్ పరిధిలో సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు ధ్రువీకరించాలి. ఆ తర్వాతే వాటి వివరాలను అప్లోడ్ చేయాలి. జిల్లాల పునర్విభజనకు అతి ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు, భూములు, ఖాళీ స్థలాలకు సంబంధించిన వివరాలను సేకరించే పర్యవేక్షణ కోసం కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ మధవీలత భావిస్తున్నారు. ఈ సెల్ ద్వారా ప్రభుత్వం ఎలాంటి సమాచారం కోరినా.. వెంటనే సంబంధిత శాఖల ద్వారా తెప్పించి వాటిని ధ్రువీకరించాక ప్రభుత్వానికి పంపే కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నారు.