బాల్య వివాహాలు చేస్తే జైలు పాలే
ABN , First Publish Date - 2021-03-07T04:58:32+05:30 IST
బాల్య వివాహాలు చేస్తే జైలు పాలే
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నర్సింగరావు
శాయంపేట, మార్చి 6: బాల్య వివాహాలు చేస్తే ఆ పిల్లల తల్లిదండ్రులు జైలు పాలుకాక తప్పదని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నర్సింగరావు అన్నారు. శనివారం స్థానిక నవోదయ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు, గ్రామ ప్రజలకు ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. వివాదాలలో చిక్కుకొని కోర్టు రాలేని పరిస్థితిలో ఉంటే వారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా రూ.3లక్షల ఆదాయం ఉన్న వారికి ఉచితంగా లాయర్ను ఏర్పాటు చేసి న్యాయం చేస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే 1098, 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. అనంతరం మండల కేంద్రంలోని మత్స్యగిరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చేనేత సొసైటీని సందర్శించారు. కార్యక్రమంలో వరంగల్ సీనియర్ సివిల్ జడ్జీ మహేష్నాథ్, పరకాల సివిల్ కోర్టు జడ్జీ దిలీప్కుమార్, ఏసీడీపీవో భాగ్యలక్ష్మి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లెక్కల జలెందర్ రెడ్డి, శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి తదితరులు పాల్గొన్నారు.