జిల్లావ్యాప్తంగా లోక్అదాలత్
ABN , First Publish Date - 2022-06-27T05:18:55+05:30 IST
జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 11,229 కేసులు పరిష్కారమయ్యాయి. వాటిలో సివిల్ 191, క్రిమినల్ 10,989, ప్రీలిటిగేషన్ కేసులు 49 ఉన్నాయి. ఒంగోలులో కార్యక్రమాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి ప్రారంభించారు. రాజీమార్గమే రాజమార్గమన్నారు. మనది కాని ఆస్తి పట్ల వ్యామోహమే సివిల్ తగాదాలకు ప్రధాన కారణమన్నారు. బడుగు, బలహీనవర్గాలకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.
11,229 కేసుల పరిష్కారం
ఒంగోలులో ప్రారంభించిన
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి
ఒంగోలు (కలెక్టరేట్), జూన్ 26 : జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 11,229 కేసులు పరిష్కారమయ్యాయి. వాటిలో సివిల్ 191, క్రిమినల్ 10,989, ప్రీలిటిగేషన్ కేసులు 49 ఉన్నాయి. ఒంగోలులో కార్యక్రమాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి ప్రారంభించారు. రాజీమార్గమే రాజమార్గమన్నారు. మనది కాని ఆస్తి పట్ల వ్యామోహమే సివిల్ తగాదాలకు ప్రధాన కారణమన్నారు. బడుగు, బలహీనవర్గాలకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. దీన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఆర్.శివకుమార్, డి.అమ్మన్నరాజా, ఎం.సోమశేఖర్, సీనియర్ సివిల్ జడ్జిలు కె.సత్యకుమారి, ఎస్.జయలక్ష్మి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు గాయత్రి, రాధిక, వెంకటేశ్వర శర్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగరగంటి శ్రీనివాసరావు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
దంపతులను కలిపిన జిల్లా జడ్జి
విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న రాయిని నాగేశ్వరరావు, రాయిని శ్రావణి దంపతులకు జిల్లా న్యాయమూర్తి భారతి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ జంటను కలిపారు. అనంతరం వారికి పలు సలహాలు ఇచ్చారు.