DivyaVani: ముగిసిన దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్.. ఫైనల్‌గా తెలిసింది ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-31T21:26:27+05:30 IST

టీడీపీ నేత దివ్యవాణి రాజీనామా కలకలం రేపింది. వర్రా రవీందర్‌రెడ్డి పేరుతో వచ్చిన పోస్టింగ్ ఆధారంగా రాజీనామా చేశానని దివ్యవాణి చెప్పారు. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో..

DivyaVani: ముగిసిన దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్.. ఫైనల్‌గా తెలిసింది ఏంటంటే..

అమరావతి: టీడీపీ నేత దివ్యవాణి రాజీనామా కలకలం రేపింది. వర్రా రవీందర్‌రెడ్డి పేరుతో వచ్చిన పోస్టింగ్ ఆధారంగా రాజీనామా చేశానని దివ్యవాణి చెప్పారు. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్లుగా ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ వైరల్ అయింది. మహానాడులో మాట్లాడే అవకాశం రాకపోవడంపై దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం వాస్తవమే కానీ ఆమె రాజీనామాపై మాత్రం గందరగోళం నెలకొంది. దివ్యవాణిని తాము సస్పెండ్ చేయలేదని టీడీపీ స్పష్టం చేసింది. గతంలోనూ కొందరు తప్పుడు పోస్ట్‌లు పెట్టారని, గతంలో అయ్యన్నను సస్పెండ్ చేసినట్లు ఫేక్‌ పోస్ట్‌లు పెట్టారని టీడీపీ గుర్తుచేసింది. రాజీనామాపై చేసిన ట్వీట్‌ను దివ్యవాణి డిలీట్ చేయడం గమనార్హం. బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత దివ్యవాణి తన రాజీనామాపై వెనక్కి తగ్గి ట్వీట్ డిలీట్ చేసినట్లు తెలిసింది. అయితే.. పార్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని మాత్రం దివ్యవాణి స్పష్టం చేశారు. మొత్తంగా తేలిందేంటంటే.. దివ్యవాణి ప్రస్తుతానికైతే టీడీపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టమైంది. టీడీపీలో ప్రస్తుతం అధికార ప్రతినిధిగా దివ్యవాణి కొనసాగుతున్నారు.


ఉదయం నుంచి అసలేం జరిగిందంటే..

మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని రెండ్రోజుల క్రితం ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు. ఇంకా ఏం చెప్పారంటే.. మహానాడులో నాకు ఘోర అవమానం జరిగింది. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. దివ్యవాణి మాటలురాని అమ్మాయి అయితే కాదు. టీడీపీకి నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నా.. గుర్తింపే లేదు. ఒక క‌ళాకారుడు (NTR) పెట్టిన పార్టీలో నాలాంటి క‌ళాకారుల‌కు స్థానం లేక‌పోవ‌డం న‌న్ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేస్తోంది. పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదు. ఇన్ని రోజులు నేను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నాను’ అని దివ్యవాణి చెప్పారు. అంతటితో ఆగని ఆమె వైసీపీ గురించి కూడా ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కానీ.. మాజీ మంత్రి కొడాలి నానితో కానీ తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. మంగళవారం (31-05-2022) ఉదయం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్య వాణి ట్వీట్ చేశారు. ‘తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల  ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో ఆమె రాసుకొచ్చారు. 


అయితే.. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఆమె తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రాజీనామా చేస్తున్నట్లు చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత దివ్యవాణి తన రాజీనామాపై వెనక్కి తగ్గి ట్వీట్ డిలీట్ చేసినట్లు తెలిసింది. దీంతో.. దివ్యవాణి టీడీపీలోనే కొనసాగుతారని స్పష్టమైంది. ఈ గందరగోళానికి తెరపడింది. అయితే.. పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చేందుకు దివ్యవాణి ఇవాళ సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడించబోతున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-05-31T21:26:27+05:30 IST