KPCC: డీకే శివకుమార్‌కు లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2022-09-17T18:14:39+05:30 IST

కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌(DK Sivakumar) ఏకగ్రీవంగా ఎన్నిక కావడం దాదాపు ఖాయం

KPCC: డీకే శివకుమార్‌కు లైన్‌ క్లియర్‌

                        - ఏకగ్రీవ ఎన్నికకే కాంగ్రె్‌స నేతల మొగ్గు 


బెంగళూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌(DK Sivakumar) ఏకగ్రీవంగా ఎన్నిక కావడం దాదాపు ఖాయం కానుంది. బెంగళూరు అంబేడ్కర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన కీలక సభలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఈమేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. కేపీసీసీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదని, మరోమారు ఆయనకే అవకాశం కల్పించాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. కేపీసీసీ(KPCC) అధ్యక్షుడిగా ఇప్పటికే రెండేళ్ల అవధిని విజయవంతంగా పూర్తి చేసుకుని పార్టీ శ్రేణుల్లో ఆయన ఉత్తేజం నింపారని, పలు ఎన్నికల్లో పార్టీని విజయపథంవైపు నడిపించారని తీర్మానంలో ప్రస్తావించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌ను రానున్న మూడేళ్ల అవధికి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రతిపాదించి దీనిపై తుది నిర్ణయాన్ని అధిష్టానం పెద్దలకు వదిలేశారు. కేపీసీసీ అధ్యక్ష పదవికి ఒకవేళ నోటిఫికేషన్‌ జారీ చేస్తే చాలామంది నామినేషన్‌ వేసే అవకాశం ఉందని, తద్వారా గ్రూపు రాజకీయాలు పెరిగి ఎన్నికలవేళ పార్టీలో కొత్త గందరగోళానికి తెరలేచే అవకాశం ఉందని, అందువల్లే ఏకగ్రీవ ఎన్నికవైపు మొగ్గు చూపుతున్నట్టు తీర్మానంలో ప్రస్తావించారు. పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని సమావేశం నిర్ణయించింది. అంబేడ్కర్‌ భవన్‌లో జరిగిన కీలక సమావేశంలో కేపీసీసీ పదాధికారులతోపాటు మాజీ మంత్రులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-17T18:14:39+05:30 IST