నిర్వాసితులను బలవంతంగా తరలించొద్దు

ABN , First Publish Date - 2021-07-25T07:54:43+05:30 IST

పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అమలు, పర్యవేక్షణ, వారి హక్కుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ పూర్తి వివరాలతో అఫిడవిట్‌

నిర్వాసితులను బలవంతంగా తరలించొద్దు

పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయండి 

పోలవరం ప్రాజెక్టు అథారిటీకి హైకోర్టు ఆదేశం


అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అమలు, పర్యవేక్షణ, వారి హక్కుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించకుండా నిర్వాసితులను తరలించబోమని కోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేసింది. నిర్వాసితులను బలవంతంగా తరలించవద్దని అధికారులకు స్పష్టం చేసింది. విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. పోలవరం ప్రాజెక్టు పరిధిలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని గిరిజన గ్రామాలను బలవంతంగా ఖాళీచేయిస్తున్నారని పేర్కొంటూ శక్తి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ పి.శివరామకృష్ణ హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యం శనివారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.ఎస్‌. మూర్తి వాదనలు వినిపిస్తూ... పోలవరం ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే గిరిజన గ్రామాలను పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించకుండా అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారన్నారు. పునరావాసం కింద ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. అక్కడి పరిస్థితులపై నివేదిక సమర్పించేలా పోలవరం అథారిటీని ఆదేశించాలన్నారు. కాఫర్‌ డ్యామ్‌లో నీటిని నిల్వ చేయడం ద్వారా ప్రజలు గ్రామాలను విడిచి వెళ్లాల్సిన పరిస్థితులను అధికారులు కల్పిస్తున్నారన్నారు. ఆ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పునరావాసం కల్పించే విషయంలో తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పోలవరం అథారిటీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - 2021-07-25T07:54:43+05:30 IST