ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , First Publish Date - 2021-10-27T05:19:36+05:30 IST
ప్రజలు సచివాలయం వద్దకు సమస్యలను తీసుకువస్తే వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.
కలెక్టరు కోటేశ్వరరావు
బనగానపల్ల్లె, అక్టోబరు 26: ప్రజలు సచివాలయం వద్దకు సమస్యలను తీసుకువస్తే వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. నందవరం గ్రామ సచివాలయాలను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నందవరం 1, నందవరం 2 సచివాలయాలను ఆయన తనిఖీ చేసి సిబ్బంది హాజరు, పనితీరును స్వయంగా పరిశీలించారు. సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు. కలెక్టరు మాట్లాడుతూ గ్రామాల్లో నిక్కచ్చిగా వ్యవహరించి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. మండలంలోని టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. డాక్టర్ శివశంకరుడి ని వ్యాక్సినేషన కార్యక్రమం గురించి వాకబు వేశారు. అనంతరం వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న కలంకారీ కళాకారుడు శివప్రసాదరెడ్డిని కలెక్టరు కోటేశ్వరావు, సబ్ కలెక్టరు చాహతబాజ్పాయ్లు సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఆల్ఫ్రెడ్, వీఆర్వో షరీప్, సర్వేయర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
సచివాలయం అకస్మిక తనిఖీ
నంద్యాల సబ్కలెక్టర్ చాహతబాజ్పాయ్ టంగుటూరు సచివాలయాన్ని మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, ప్రజాసమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్లు ఆమె స్వయంగా గమనించారు. సచివాలయ సిబ్బంది వేస్తున్న బయోమెట్రిక్ను ఆమె పరిశీలించారు. సమస్యలు, వాటి పరిష్కారాలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ కార్యకలాపాలపై ఆరా తీశారు. సంక్షేమ పథకాల వివరాలు తమ దగ్గర ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన వేసుకునేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. దిశా యాప్పై మహిళలకు అవగాహన కల్పించాలని మహిళా పోలీసును ఆదేశించారు. అలాగే టంగుటూరు చౌక దుకాణాన్ని ఆమె తనిఖీ చేశారు.