కేంద్రంతో ఉద్యోగాల ప్రకటన చేయించే దమ్ముందా?

ABN , First Publish Date - 2022-04-26T08:16:55+05:30 IST

‘వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 15 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీకి కేంద్రంతో

కేంద్రంతో ఉద్యోగాల  ప్రకటన చేయించే దమ్ముందా?

  • బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిలను  ప్రశ్నించిన మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట టౌన్‌, ఏప్రిల్‌ 25: ‘వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 15 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీకి కేంద్రంతో ప్రకటన చేయించాలి. అలా చేస్తే మీకే క్షీరాభిషేకం చేస్తాం. ఆ ప్రకటన చేయించే దమ్ము మీకుందా?’  అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలను రాష్ట్ర  మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం సిద్దిపేటలోని జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉచిత భోజన సౌకర్యాన్ని ఆయన ప్రారంభించారు.


ఈసందర్భంగా స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. బీజేపీ నాయకులు కనీస అవగాహన, విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. సమ నిష్పత్తి ఉండాలనే ఉద్దేశంతో నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేందుకే సీఎం కేసీఆర్‌ 317 జీవో తీసుకొచ్చారని చెప్పారు. కానీ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేలా 317 జీవోను రద్దు చేయాలని బండి సంజయ్‌ దీక్ష చేస్తాననడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.


15 లక్షల ఉద్యోగాల ప్రకటన వెలువడితే అందులో తెలంగాణ నుంచి ఒక లక్ష ఉద్యోగాలు సంపాదించేందుకు నిరుద్యోగులు కృషి చేస్తారని తెలిపారు. కేంద్ర సర్కారు రైళ్లను, రైల్వే స్టేషన్లను, రైల్వే లైన్లను కూడా అమ్ముకుంటోందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, సిద్దిపేట పట్టణంలో నెలకొల్పిన నర్సింగ్‌ కళాశాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.   


Updated Date - 2022-04-26T08:16:55+05:30 IST