ఆడపడుచును అవమానిస్తారా..?
ABN , First Publish Date - 2022-07-17T09:32:45+05:30 IST
‘‘జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి మన ఇంటి ఆడపడుచు.
- జడ్పీ చైర్పర్సన్ను అందరూ గౌరవించాలి
- దాడిలో పాల్గొన్న నాయకులపై చర్యలు: మంత్రి కేటీఆర్
వికారాబాద్, జూలై 16(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి మన ఇంటి ఆడపడుచు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి లో చెరగని ముద్ర వేసిన ఆమెను అవమానిస్తారా? ఆడపడుచును గౌరవం గా చూసుకోవాలి. దురదృష్టకరమైన పట్లూరు సంఘటన బాధాకరం. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. పా ర్టీకి నష్టం కలిగించే చేష్టలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. విబేధాలు వీడి పార్టీ పటిష్టతకు అందరూ సమన్వయంతో కృషి చేయాలి’’ అని టీఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి కారుపై బుధవారం కొందరు దాడి చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్లో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, నరేందర్రెడ్డి, కాలే యాదయ్యలతో కేటీఆర్ సమావేశమయ్యారు. చైర్పర్సన్, వికారాబాద్ ఎమ్మెల్యేతో వేర్వేరుగా మాట్లాడారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాండూరు, వికారాబాద్ ని యోజక వర్గాల్లో కొంత కాలంగా తనకు ఎదురవుతున్న అవమానాల గురిం చి సునీతారెడ్డి ఏకరువు పెట్టారు. మర్పల్లి సంఘటనతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.. కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అభివృద్ధి విషయంలో జడ్పీ చైర్పర్సన్ అంకితభావాన్ని అభినందించాలని, భవిష్యత్తులో పట్లూర్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ప్రతిపక్ష పార్టీల వద్ద చులకనయ్యే విధంగా వ్యవహరించకూడదని ఎమ్మెల్యే ఆనంద్కు సూచించినట్లు సమాచారం. ఇక మీదట పార్టీ అంతర్గత విషయాలు బయటకు రాకుండా అందరినీ సమన్యయ పర్చుకుంటూ ముందుకు సాగాలని కేటీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దాడికి పాల్పడిన వారిలో పార్టీ వారెవరున్నా చర్యలు తీసుకునే బాధ్యతను ఎంపీ రంజిత్రెడ్డికి కేటీఆర్ అప్పగించారు.