భరించలేని బాధతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. అతడి సమస్య విని నోరెళ్లబెట్టిన వైద్యులు.. చివరికి ఎలాంటి వైద్యం చేశారో తెలుసా..

ABN , First Publish Date - 2021-11-21T02:01:54+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో ఓ పూజారికి వింత సమస్య ఎదురైంది. భరించలేని బాధతో ఆస్పత్రికి వెళ్లాడు. తీరా అతడి సమస్య విని వైద్యులే నోరెళ్లబెట్టారు. చివరికి ఏం జరిగిందో తెలుసుకుందాం...

భరించలేని బాధతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. అతడి సమస్య విని నోరెళ్లబెట్టిన వైద్యులు.. చివరికి ఎలాంటి వైద్యం చేశారో తెలుసా..

భగవంతుడికి, భక్తుడికి అనుసంధాన కర్తలుగా పూజారులు వ్యవహరిస్తుంటారు. భక్తుల సమస్యలు తీర్చమని పూజారులు దేవుడికి నివేదిస్తూ, గోత్రాలు వళ్లిస్తూ, మంత్రాలు చదువుతూ పూజలు చేయడం అందరికీ తెలిసిందే. మనకు సమస్యలు వస్తే వారికి చెప్పుకొంటాం. మరి పూజారుల సమస్యలకు వస్తే.. ఏం చేస్తారు. అది ఆ దేవుడే చూసుకుంటాడని అంటారు కదా. కానీ ఉత్తర ప్రదేశ్‌లో ఓ వ్యక్తికి మాత్రం వింత సమస్య ఎదురైంది. భరించలేని బాధతో ఆస్పత్రికి వెళ్లాడు. తీరా అతడి సమస్య విని వైద్యులే నోరెళ్లబెట్టారు. చివరికి ఏం జరిగిందో తెలుసుకుందాం...


ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలో అర్జున్ నగర్‌లోని ఖేరీ మోడ్‌లోని పట్వారీ ఆలయానికి.. లేఖ్ సింగ్ అనే వ్యక్తి, 30 ఏళ్లుగా పూజారిగా ఉన్నారు. నిత్యం దేవుడి సేవలో తరిస్తూ ఉన్న అతడికి ఓ పెద్ద సమస్య వచ్చింది. ఓ రోజు భరించలేని బాధతో పరుగుపరుగున స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. తనకు పెద్ద సమస్య వచ్చిందని, వెంటనే వైద్యం చేయాలని డాక్టర్లతో మొర పెట్టుకున్నాడు. అతన్ని సముదాయించిన వైద్యులు.. సమస్య ఏంటో చెప్పమన్నారు. తీరా అతడు చెప్పిన సమస్య విని షాక్ అయ్యారు. ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహానికి వైద్యం చేయాలని చెప్పడంతో.. వైద్యులకు కొద్దిసేపు ఏమీ అర్థం కాలేదు. విగ్రహానికి వైద్యం ఏంటి.. అని ప్రశ్నించగా అసలు విషయం చెప్పుకొచ్చాడు.


పూజల్లో భాగంగా తాను శ్రీకృష్ణుడి విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా.. పొరపాటున కింద పడి చేయి విరిగిందని బోరున విలపించాడు. అప్పటికీ షాక్‌లోనే ఉన్న వైద్యులు.. కొద్దిసేపటికి తేరుకుని, విగ్రహానికి తాము వైద్యం చేయడం ఏంటి అని వాదించారు. అయినా ఆ పూజారి పట్టువిడవలేదు. ఎలాగైనా విగ్రహం చేయికి కట్టుకట్టాలని వేడుకున్నాడు. చివరికి అతడి దైవ భక్తిని, అమాయకత్వాన్ని అర్థం చేసుకున్న వైద్యులు.. చేతికి కట్టు కట్టేందుకు ఒప్పుకొన్నారు. విగ్రహాన్ని తెప్పించి, విరిగిన చేయి అతికించి కట్టుకట్టారు. ఆస్పత్రి రిజిస్టర్‌లో శ్రీకృష్ణుడికి చికిత్స చేసినట్లు నమోదు చేశామని వైద్యులు తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Updated Date - 2021-11-21T02:01:54+05:30 IST