5 కి.మీ.లు డోలీలో మోసుకుంటూ...
ABN , First Publish Date - 2022-01-21T06:10:41+05:30 IST
తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ గిరిజనుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించడానికి ఐదు కిలోమీటర్ల మేర డోలీలో మోసుకురావాల్సిన దుస్థితి నెలకొంది.
రోగిని ఆస్పత్రికి తరలించడానికి కుటుంబీకుల పాట్లు
జి.మాడుగుల, జనవరి 20: తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ గిరిజనుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించడానికి ఐదు కిలోమీటర్ల మేర డోలీలో మోసుకురావాల్సిన దుస్థితి నెలకొంది. సోలభం పంచాయతీ బంగారుబుడ్డి గ్రామానికి చెందిన పాంగి భీమన్న(50) నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఆశా కార్యకర్త వద్ద మాత్రలు తీసుకుని వాడినా తగ్గకపోవడంతో జి.మాడుగుల పీహెచ్సీకి తరలించాలని కుటుంబీకులు నిర్ణయించారు. అయితే బంగారుబుడ్డి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచాయతీ కేంద్రం సొలభం వరకు ఎటువంటి రోడ్డు సదుపాయం లేదు. దీంతో భీమన్నను డోలీలో మోసుకుంటూ సోలభం చేరుకుని, అక్కడి నుంచి ఆటోలో జి.మాడుగుల పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని బంగారుబుడ్డి గిరిజనులు విజ్ఞప్తిచేస్తున్నారు.