మళ్లీ ‘బేర్’మన్న సెన్సెక్స్
ABN , First Publish Date - 2022-10-04T09:09:18+05:30 IST
దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీ ఒక్కరోజుతోనే ఆవిరైంది. శుక్రవారం రేసు గుర్రంలా పరిగెత్తిన సూచీలు, సోమవారం మళ్లీ చతికిల పడ్డాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీ ఒక్కరోజుతోనే ఆవిరైంది. శుక్రవారం రేసు గుర్రంలా పరిగెత్తిన సూచీలు, సోమవారం మళ్లీ చతికిల పడ్డాయి. సెన్సెక్స్ 638.11 పాయింట్ల నష్టంతో 56788.81 వద్ద, నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో 16887.35 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 771 పాయింట్ల వరకు నష్టపోయింది. తర్వాత కొద్దిగా కోలుకున్నా నష్టాలు తప్పలేదు. నిఫ్టీ-50 జాబితాలోని 50 కంపెనీల షేర్లలో 42 కంపెనీల షేర్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ వంటి ఫార్మా కంపెనీల షేర్లు మాత్రం లాభాలతో ముగిశాయి.
కారణాలు:
ప్రముఖ అంతర్జాతీయ ఇన్వె్స్టమెంట్ బ్యాంకులు డాయిష్ బ్యాంకు, క్రెడిట్ స్విస్ తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్నాయన్న వార్తలు మార్కెట్ను వణికించాయి. ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, రిస్కీ పెట్టుబడులకు ఇన్వెస్టర్లు దూరంగా ఉండడం, డాలర్తో ఆగని రూపా యి పతనం ఇందుకు తోడయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ అమ్మకాలకు దిగారు. ఒపెక్ దేశాలు మళ్లీ చమురు ఉత్పత్తిపై కోత విధిస్తాయనే భయమూ ఇందుకు తోడైంది.
అదానీ గ్రూపు షేర్లు ఫట్
అదానీ గ్రూపు కంపెనీల షేర్లు సోమవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో బీఎ్సఈలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 8.51 శాతం నష్టంతో రూ.3,157.15 వద్ద, అదానీ టోటల్ గ్యాస్ 6.96 శాతం నష్టంతో రూ.3,104.65 వద్ద, అదానీ పవర్ 4.99 శాతం నష్టంతో రూ.355.15 వద్ద, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీ షేర్లు 5.17 శాతం నష్టంతో రూ.3,120.65 వద్ద, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ షేర్లు 8.09 శాతం నష్టంతో రూ.2,076.65 వద్ద, అదానీ విల్మార్ షేర్లు ఐదు శాతం నష్టంతో రూ.717.55 వద్ద ముగిశాయి. ఇటీవల అదానీ గ్రూపు టేకోవర్ చేసిన ఏసీసీ, అంబుజా సిమెంట్ షేర్లూ సోమవారం నష్టాలతో ముగిశాయి. ఏసీసీ 4.64 శాతం నష్టంతో రూ.2,296.80 వద్ద, అంబుజా సిమెంట్స్ షేర్లు 5.22 శాతం నష్టంతో రూ.488.55 వద్ద క్లోజయ్యాయి.