వీగిన అభిశంసన తీర్మానం.. ఇప్పుడే అసలు ఉద్యమం ప్రారంభమైందన్న ట్రంప్

ABN , First Publish Date - 2021-02-14T14:20:47+05:30 IST

కేపిటల్ భవనంపై దాడి​ ఘటనకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను సెనేట్ శనివారం నిర్దోషిగా తేల్చింది​.

వీగిన అభిశంసన తీర్మానం.. ఇప్పుడే అసలు ఉద్యమం ప్రారంభమైందన్న ట్రంప్

వాషింగ్టన్: కేపిటల్ భవనంపై దాడి​ ఘటనకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను సెనేట్ శనివారం నిర్దోషిగా తేల్చింది​. ట్రంప్‌ను అభిశంసించేందుకు ఉద్దేశించిన తీర్మానం 57-43 తేడాతో వీగిపోయింది. ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని నాలుగు రోజులపాటు విచారించిన సెనేట్ చివరకు నిర్దోషిగా తేల్చింది. ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే అసలు రాజకీయ ఉద్యమం ప్రారంభమైందన్నారు. అమెరికా గ్రేట్ ఎగైన్ కోసం చారిత్రాత్మక, దేశభక్తితో కూడిన అందమైన ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. 


అలాగే ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే మరో అధ్యాయమని పేర్కొన్నారు. 'మన ముందు ఇంకా చాలా పని ఉంది. త్వరలో మనం ప్రకాశవంతమైన, అపరిమితమైన అమెరికన్ భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమం ద్వారా మళ్లీ కలుద్దాం.' అని అన్నారు. సత్యాన్ని, న్యాయాన్ని సమర్ధిస్తూ తనకోసం పనిచేసిన లాయర్లకు ఈ సందర్భంగా ట్రంప్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. 


ఇదిలాఉంటే.. మెుత్తం 100 మంది సభ్యులున్న సెనెట్‌లో ట్రంప్‌పై అభిశంసనకు అనుకూలంగా 57 మంది ఓటువేస్తే.. వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. దీంతో అభిశంసన తీర్మానం 57-43 తేడాతో వీగిపోయింది. ఏడుగురు రిపబ్లికన్ సెనెటర్లు సైతం ట్రంప్‌ను అభిశంసించడానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. అయినా ట్రంప్ అభిశంసనానికి అవసరమైన 67 ఓట్లు రాలేదు. ఇక అగ్రరాజ్యం అధ్యక్షుల చరిత్రలోనే రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న వ్యక్తిగా ట్రంప్‌ మిగిలిపోయారు. అలాగే పదవీవిరమణ అనంతరం కూడా అభిశంసనని ఎదుర్కొన్న అధ్యక్షుడు కూడా ట్రంపే.


Updated Date - 2021-02-14T14:20:47+05:30 IST